అవకాశం ఇస్తే.. రాజన్న రాజ్యం

23 Feb, 2019 13:35 IST|Sakshi
కసనూరులో పర్యటిస్తున్న మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, పార్టీ శ్రేణులు

వైఎస్‌ఆర్‌ జిల్లా , పులివెందుల(సింహాద్రిపురం) : ఒక్కసారి ఆశీర్వదించి అవకాశం ఇస్తే రాజన్న రాజ్యం అందిస్తామని కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. సింహాద్రిపురం మండలం కసనూరు గ్రామంలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ మండల ఇన్‌చార్జి ఎన్‌ శివప్రకాష్‌రెడ్డితో కలిసి రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి, వేయించి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి కలిగే లబ్ధిని వారు వివరించారు. బీసీ సబ్‌ప్లాన్‌కు జగన్‌ చట్టబద్ధత కల్పిస్తారని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వెనుబడిన కులాలకు 50 శాతం పదవులు వస్తాయని అవినాష్‌రెడ్డి తెలిపారు. బీసీల్లోని 139 కులాలకు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. బడిఈడు పిల్లలను బడికి పంపిస్తే ఆ తల్లికి ఏటా రూ.15వేలు తల్లి ఖాతాలో నేరుగా జమ చేస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే బీసీ డిక్లరేషన్‌ ఏర్పాటు చేస్తామని వివరించారు. సంచార జాతులకు ఉచితంగా ఇళ్లు, ఉపాధి, వారి పిల్లల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సహకార డెయిరీకి పాలు పోస్తే లీటర్‌కు రూ.4 అదనంగా ఇస్తామన్నారు. అలాగే ప్రతి నిరుపేద, నిరుద్యోగికి లబ్ధి చేకూరుతుందన్నారు. ఇళ్లులేని వారికి ఇల్లు కట్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు.  ఒక్కసారి వైఎస్‌ జగన్‌కు అవకాశం ఇస్తే.. ప్రతి ఒక్కరి గుండెలో ఆయన చిరస్థాయిగా నిలిచేలా పరిపాలన అందిస్తారని అవినాష్‌రెడ్డి ప్రజలకు వివరించారు.

మరిన్ని వార్తలు