హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన హిట్లర్ పాలనను తలపిస్తోందని వైఎస్సార్సీపీ నేతలు మహ్మద్ ఇక్బాల్, పొన్నవోలు సుధాకర్ రెడ్డిలు విమర్శించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. పోలీస్ యంత్రాంగం టీడీపీకి తొత్తుగా మారిపోయిందని మండిపడ్డారు. చట్ట బద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసులు.. టీడీపీ ఆదేశాల మేరకు పనిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తూ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారన్నారు.
అసలు సంబంధం లేని పనులతో అమాయకులను వేధిస్తున్నారని, రాజ్యాంగం ఇచ్చిన భావ స్వేచ్ఛను పోలీసులు ఆటంకం కల్గించవద్దని వారు విన్నవించారు. సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో టీడీపీ నేతల చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే థర్డ్ పార్టీకి విచారణను అప్పగించాలని డిమాండ్ చేశారు.