డబుల్స్‌లో బోపన్న ర్యాంక్ మెరుగు

17 May, 2016 01:22 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ ఆటగాడు రోహన్ బోపన్న రియో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాలు మెరుగుపడుతున్నాయి. సోమవారం విడుదల చేసిన ఏటీపీ తాజా ర్యాంకింగ్స్‌లో బోపన్న రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానంలో నిలిచాడు. రోమ్ మాస్టర్స్ టోర్నీలో సెమీస్‌కు చేరడంతో బోపన్న-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంటకు 360 పాయింట్లు లభించాయి.

టాప్-10లో ఉండే ఆటగాడు ఒలింపిక్స్‌లో తన భాగస్వామిని ఎంచుకునే అవకాశం ఉండటంతో బోపన్న ఇప్పుడు ర్యాంక్‌ను మరింత మెరుగుపర్చుకోవడంపై దృష్టిపెట్టాడు. వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్ నాలుగు స్థానాలు ఎగబాకి 50వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. సాకేత్ 125వ ర్యాంక్‌లో ఉన్నాడు.

>
మరిన్ని వార్తలు