అదరగొట్టిన అలీ.. పాక్‌ ఘన విజయం

3 Apr, 2017 15:37 IST|Sakshi
అదరగొట్టిన అలీ.. పాక్‌ ఘన విజయం

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ తో జరిగిన నాలుగు టి20ల సిరీస్ ను 3-1తో పాకిస్తాన్ కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్ లో విండీస్ ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి సిరీస్ దక్కించుకుంది. టాస్  ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 124 పరుగులు చేసింది. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విండీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. వాల్టన్(40), బ్రాత్ వైట్(37), శామ్యూల్స్(22) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు.

పాక్ బౌలర్లలో హసన్ అలీ 4 ఓవర్లు వేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రెండు మేడిన్ ఓవర్లు వేశాడు. షదబ్ ఖాన్ 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. 125 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 19 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 127 పరుగులు సాధించింది. అహ్మద్ షెహజాద్(53), కమ్రాన్ అక్మల్(20), బాబర్ ఆజామ్(38) రాణించారు. హసన్ అలీకి ’మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. షదబ్ ఖాన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అందుకున్నాడు.

మరిన్ని వార్తలు