అంపైర్ రవూఫ్‌పై ఐదేళ్ల నిషేధం

13 Feb, 2016 00:38 IST|Sakshi
అంపైర్ రవూఫ్‌పై ఐదేళ్ల నిషేధం

ముంబై: మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ అంపైర్ అసద్ రవూఫ్‌పై బీసీసీఐ ఐదేళ్ల నిషేధం విధించింది. బోర్డు క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. 2013 ఐపీఎల్ సీజన్‌లో బుకీల నుంచి విలువైన బహుమతులను తీసుకుని మ్యాచ్‌కు సంబంధించిన విషయాలను తెలిపినట్టు 59 ఏళ్ల రవూఫ్‌పై ఆరోపణలు వచ్చాయి. ‘అంపైర్ విధుల నుంచే కాకుండా బీసీసీఐకి సంబంధించి ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఆయనపై ఐదేళ్ల నిషేధం విధిస్తున్నాం’ అని బోర్డు పేర్కొంది.

తనపై వచ్చిన ఆరోపణలపై ఈనెల 8న అతడు రాతపూర్వక సమాధానమిచ్చినట్టు తెలిపింది. మరోవైపు ఈ నిషేదంపై రవూఫ్ స్పందించారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండానే ఈ నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ‘నాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని ముంబై కోర్టు గతంలోనే పోలీసులకు చెప్పింది. మరి వీరు ఏ అధికారంతో నన్ను నిషేధించారు? కమిటీ విచారణకు నా లాయర్లతో పాటు వస్తానని చెప్పినా ఒక్కడినే రమ్మని ఒత్తిడి చేశారు. అందుకే వెళ్లలేదు. కరాచీ, దుబాయ్‌లో కలుస్తానని చెప్పినా వారు అంగీకరించలేదు. ఈ నిషేధంపై బీసీసీఐకి నోటీసు ఇస్తాను. అసలు వారికి ఆ అధికారమే లేదు’ అని రవూఫ్ అన్నారు.

మరిన్ని వార్తలు