రోహిత్‌, జడేజా మీరు ఏం చేస్తున్నారు?: కోహ్లి

10 Aug, 2019 11:00 IST|Sakshi

గయానా: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మల మధ్య విభేదాలున్నాయని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. జట్టులో ఇద్దరూ తలోదారిగా ఉన్నారంటూ వార్తలు వ్యాపించాయి. వీటి సంగతి ఎలా ఉన్నా కోహ్లి-రోహిత్‌లు మరోసారి వార్తల్లో నిలిచారు. వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా శుక్రవారం భారత్‌ జట్టు తొలి వన్డే వర్షం కారణంగా రద్దయ్యింది. ఈ క్రమంలోనే రవీంద్ర జడేజా-రోహిత్‌లు మూగ సైగల ద్వారా ఒక పోటీ పెట్టుకున్నారు. ఇందులో ఒక ఆటగాడ్ని ఒకరు అనుకరిస్తే మరొకరు వారి పేరు చెప్పాలి.

దీనిలో భాగంగా తొలుత జస్‌ప్రీత్‌ బుమ్రాను జడేజా ఇమిటేట్‌ చేశాడు. దాంతో అక్కడ సరదా వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత కోహ్లి శైలిని అనుకరించమని రోహిత్‌ ఫ్లకార్డు చూపించడంతో జడేజా అచ్చం అలానే చేసి చూపించాడు. కోహ్లి బంతిని ఎదుర్కొనే క్రమంలో ఏమి చేస్తాడు.. బంతిని ఎలా విడిచిపెడతాడు అనే దానిని జడేజా మూగ సైగల ద్వారా అనుకరించాడు. దాంతో అక్కడ మరోసారి నవ్వుల వాతావరణం ఏర్పడింది. దీన్ని కూర్చిలో కూర్చుని దూరంగా ఉండి గమనిస్తున్న కోహ్లి సైతం నవ్వుకుంటూ.. రోహిత్‌, జడేజా మీరు ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నించాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్వీటర్‌ పేజీలో పోస్ట్‌ చేయడంతో అది వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు