పసికూనపై కివీస్ ఘన విజయం

10 Aug, 2016 18:43 IST|Sakshi
పసికూనపై కివీస్ ఘన విజయం

బులవాయో: జింబాబ్వేతో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 254 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ 2-0తో కివీస్ సొంతం చేసుకుంది. 387 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జింబాబ్వే 68.4 ఓవర్లాడి 132 పరుగులకే కుప్పకూలడంతో దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఓవర్ నైట్ స్కోరు 58/3తో ఐదో రోజు బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే స్వల్ప స్కోరుకే చేతులెత్తేసింది. రెండో ఇన్నింగ్స్ లో కివీస్ బౌలర్లలో గప్టిల్, సోదీ చెరో మూడు వికెట్లు తీశారు.

న్యూజీలాండ్ బౌలర్ నీల్ వాగ్నర్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ సొంతం చేసుకోగా, రెండు ఇన్నింగ్స్ లో రాణించిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో న్యూజీలాండ్ ఆటగాళ్లు లాథమ్ (136), రాస్ టేలర్ (124 నాటౌట్),  విలియమ్సన్ (113) చెలరేగడంతో కివీస్ 582/4 డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లో విలియమ్సన్(68 నాటౌట్), టేలర్(67 నాటౌట్) రాణించారు. జింబాబ్వే నుంచి ఎర్విన్(146) ఒక్కడు మాత్రమే సెంచరీ చేయగా, చిబాబా(60) మాత్రమే పరవాలేదనిపించాడు.

న్యూజీలాండ్ తొలి ఇన్నింగ్స్: 582/4 డిక్లేర్
రెండో ఇన్నింగ్స్ : 118/2 డిక్లేర్
జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ : 362 ఆలౌట్
రెండో ఇన్నింగ్స్ : 132 ఆలౌట్
 

మరిన్ని వార్తలు