పాక్‌ క్రికెటర్‌ జట్టులో రోహిత్‌..!

27 Feb, 2020 17:39 IST|Sakshi

కరాచీ:  పలువురు క్రికెటర్లకు తమ ఆల్‌టైమ్‌ జట్లను ప్రకటించడం పరిపాటి. ఇప్పుడు ఈ కోవలోకే పాకిస్తాన్‌ ఓపెనర్‌ ఫకార్‌ జమాన్‌ సైతం చేరిపోయాడు. ఇదే తన ఆల్‌టైమ్‌ టీ20 ఎలెవన్‌ అంటూ ప్రకటించేశాడు. ఇలా ఫకార్‌ జమాన్‌ ప్రకటించిన జట్టులో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు అవకాశం కల్పించాడు. ఓపెనింగ్‌ విభాగంలో రోహిత్‌ శర్మకు జతగా దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ను ఎంపిక చేశాడు. ఫకార్‌ జట్టు తన జట్టులో ఎక్కువ శాతం మంది ఇంగ్లండ్‌ క్రికెటర్లకే ప్రాధాన్యత ఇచ్చాడు. జేసన్‌ రాయ్‌, జోస్‌ బట్లర్‌, బెన్‌ స్టోక్స్‌లకు అవకాశం కల్పించాడు. భారత్‌ నుంచి రోహిత్‌ శర్మతో పాటు పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు కూడా ఫకార్‌ చోటిచ్చాడు. కాగా, టీమిండియా కెప్టెన్‌, పరుగుల మెషీన్‌ విరాట్‌ కోహ్లికి మాత్రం ఫకార్‌ తన జట్టులో అవకాశం ఇవ్వలేదు. ఎంఎస్‌ ధోనిని కూడా తన ఎలెవన్‌ జట్టులో ఎంపిక చేయలేదు. 

రోహిత్‌ శర్మ, ఏబీ డివిలియర్స్‌లను ఓపెనర్లుగా ఎంపిక చేసిన ఫకార్‌.. ఫస్ట్‌ డౌన్‌ ఆటగాడిగా జేసన్‌ రాయ్‌ను తీసుకున్నాడు. వికెట్‌ కీపర్‌గా జోస్‌ బట్లర్‌ను ఎంపిక చేయగా, ఆల్‌ రౌండర్‌ కోటాలో స్టోక్స్‌, కీరోన్‌ పొలార్డ్‌లను ఎంపిక చేశాడు. స్పిన్నర్ల విభాగంలో అఫ్గానిస్తాన్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌కు చోటిచ్చాడు. పేస్‌ విభాగంలో బుమ్రాకు తోడుగా ఆసీస్‌ ప్రధాన పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ను ఎంపిక చేశాడు. పాకిస్తాన్‌ నుంచి షోయబ్‌ మాలిక్‌కు మాత్రమే ఫకార్‌ తన జట్టులో అవకాశం ఇచ్చాడు. బాబర్‌ అజామ్‌ వంటి స్టార్‌ ఆటగాడున్నప్పటికీ అతనికి చోటివ్వలేదు. 

ఫకార్‌ జమాన్‌ ఆల్‌టైమ్‌ ఎలెవన్‌ ఇదే
ఏబీ డివిలియర్స్‌, రోహిత్‌ శర్మ, జేసన్‌ రాయ్‌, షోయబ్‌ మాలిక్‌, జోస్‌ బట్లర్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌​, బెన్‌ స్టోక్స్‌, కీరోన్‌ పొలార్డ్‌, మిచెల్‌ స్టార్క్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, రషీద్‌ ఖాన్‌


 

మరిన్ని వార్తలు