పీఎస్‌ఎల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ : పాక్‌ క్రికెటర్‌పై నిషేధం!

28 Feb, 2018 20:29 IST|Sakshi
షాజాబ్‌ హసన్‌ (ఫైల్‌)

మాజీ ఓపెనర్‌ షాజాబ్‌ హసన్‌పై ఏడాది నిషేధం

టీ20 ప్రపంచకప్‌ విజేత జట్టులో సభ్యుడు

సాక్షి, స్పోర్ట్స్‌: పాకిస్తాన్‌ మాజీ ఓపెనర్‌ షాజాబ్‌ హసన్‌పై ఆదేశ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఏడాది నిషేధంతో పాటు పదిలక్షల రూపాయల జరిమాన విధించింది. గతేడాది దుబాయ్‌ వేదికగా జరిగిన పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)లో షాజాబ్‌తో పాటు పలువురు పాక్‌ క్రికెటర్లు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీరిలో కొంతమందిపై ఇప్పటికే చర్యలు తీసుకున్న పీసీబీ తాజాగా హసన్‌పై నిషేధం విధించింది. ఈ విషయాన్ని బోర్డు లీగల్‌ అడ్వైజర్‌ తాఫ్ఫాజుల్‌ రిజ్వీ ధృవీకరించారు. ఇతర క్రికెటర్లు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ల పాల్పడకుండా హసన్‌పై మరిన్ని కఠిన చర్యలు తీసుకునేలా చార్జ్‌ షీట్‌ దాఖలు చేస్తామని ఆయన మీడియాకు వెల్లడించారు.

దూకుడు ఓపెనర్‌ అయిన హసన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో కేవలం మూడు  వన్డేలు, 10 టీ20లే ఆడాడు. 2009 టీ20 ప్రపంచకప్‌ విజేత పాక్‌జట్టులో హసన్‌ సభ్యుడు. పేలవ ప్రదర్శనతో 2010 అనంతరం పాక్‌ జట్టులో చోటు కోల్పోయాడు. పీఎస్‌ఎల్‌లో కరాచి కింగ్స్‌కు తరపున ఆడాడు. రెండో సీజన్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు ఎదుర్కొన్న ఆదేశ క్రికెటర్లు షర్జీల్‌ ఖాన్‌,  నాసిర్‌ జంషేడ్, ఖలీద్‌ లతీఫ్‌లు ఇప్పటికే శిక్షను అనుభవిస్తున్నారు. షర్జీల్‌ ఖాన్‌ను రెండున్నరేళ్లు నిషేధించగా.. ఖలీద్‌ లతీఫ్‌పై పీసీబీ ఐదేళ్లు నిషేధం విధించింది. ఇక పీఎస్‌ఎల్‌ మూడో సీజన్‌ కూడా దుబాయ్‌ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు