న్యూఢిల్లీ : పార్లమెంట్ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. పార్లమెంట్ సభ్యుల(ఎంపీల) నియోజకవర్గం, ఫర్నీచర్, కమ్యూనికేషన్ ఖర్చుల అలవెన్స్ల పెంపుకు కేంద్ర మంత్రి వర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ అలవెన్స్ పెంపుతో ఇప్పటి వరకున్న ఫర్నీచర్ కొనుగోలు అలవెన్స్ 75వేల రూపాయల నుంచి లక్ష రూపాయలకు పెరిగింది. అదేవిధంగా నియోజకవర్గ అలవెన్స్ కూడా 60వేల రూపాయలకు పెరిగింది. 45వేల రూపాయలుగా ఉన్న ఈ అలవెన్స్ను రూ.60వేలకు పెంచాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.
అలవెన్స్ల పెంపుతో ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.39 కోట్ల అదనపు భార పడనున్నట్టు తెలుస్తోంది. కాగ, ఎంపీల వేతనాలను కూడా ద్రవ్యోల్బణంతో లింక్ చేస్తూ ప్రతి ఐదేళ్లకు ఒక్కసారి సమీక్షించేలా ఓ శాశ్వత మెకానిజనాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ బడ్జెట్ ప్రసంగంలోనే ప్రకటించారు. ఎంపీలకు ఇచ్చే వేతనంలో 50 వేల రూపాయల బేసిక్ శాలరీ, 45 వేల రూపాయల నియోజకవర్గ అలవెన్స్ ఉంటాయి. మొత్తంగా ఒక్కో ఎంపీపై నెలకు రూ.2.7 లక్షలను ప్రభుత్వం వెచ్చిస్తోంది. స్పీకర్ను మినహాయిస్తే ప్రస్తుతం లోక్సభలో 536 మంది ఎంపీలున్నారు. వారిలో ఇద్దరు ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీకి చెందినవారు. రాజ్యసభలో 239 మంది సభ్యులున్నారు.