మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు

2 Feb, 2014 01:36 IST|Sakshi
మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు

కొచ్చి: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ స్టార్ పి.వి. సింధు టైటిల్ పోరుకు అర్హత సంపాదించింది. మహిళల డబుల్స్‌లో రాష్ట్రానికి చెందిన సిక్కి రెడ్డి జోడి కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సింధు 19-21, 21-19, 21-9తో ఆరో సీడ్ సయాలీ గోఖలేపై విజయం సాధించింది. మరో సెమీస్‌లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన 8వ సీడ్ రుత్విక శివాని 19-21, 19-21తో మూడో సీడ్ పి.సి.తులసి (కేరళ) చేతిలో ఓడింది.
 
 ఆదివారం జరిగే ఫైనల్లో తులసీతో సింధు అమీతుమీ తేల్చుకోనుంది. మహిళల డబుల్స్ ఈవెంట్‌లో మూడో సీడ్ సిక్కిరెడ్డి (ఏపీ) -అపర్ణా బాలన్ జంట 21-12, 21-14తో రెండో సీడ్ మనీషా (ఏపీ)-సంయోగిత గోర్పడే జోడికి షాకిచ్చింది. మరో సెమీస్‌లో మేఘన-రీతుపర్ణా దాస్ (ఆంధ్రప్రదేశ్) జోడి 12-21, 21-18, 15-21తో టాప్ సీడ్ ప్రజక్తా సావంత్- ఆరతి సారా జంట చేతిలో పరాజయం చవిచూసింది.
 
  ఫైనల్లో సిక్కిరెడ్డి జోడి... ప్రజక్తా జంటతో తలపడుతుంది. పురుషుల డబుల్స్‌లో హేమ నాగేంద్రబాబు-నందగోపాల్ (ఏపీ) 15-21, 14-21తో అల్విన్ ఫ్రాన్సిస్- అరుణ్ విష్ణు జంట చేతిలో, మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-నందగోపాల్ (ఏపీ) జోడి 18-21, 19-21తో ప్రజక్తా- సనావే థామస్ జంట చేతిలో పరాజయం చవిచూశారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ ప్రణయ్ 21-18, 13-21, 16-21తో ఏపీ యువ సంచలనం, టాప్ సీడ్ కిడాంబి శ్రీకాంత్‌కు షాకిచ్చాడు.
 

మరిన్ని వార్తలు