క్రికెట్‌ తరహా తప్పిదాలు చేయకండి..!

21 Apr, 2020 12:15 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి ఢిల్లీలో అధికంగా ఉండటంతో ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ నిబంధనల్ని పాటించాలని ప్రజలకు టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ విజ్ఞప్తి చేశాడు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వం మార్గదర్శకాలను తప్పకుండా పాటించి కరోనా నివారణలో భాగం కావాలన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటుకు తావు ఇవ్వద్దన్నాడు. ఒక్క తప్పు  కరోనా నివారణ కోసం జరుగుతున్న పోరాటాన్ని తీవ్ర ప్రభావం చూపుతుందన్నాడు. ఇందుకు క్రికెట్‌లో చేసే తప్పిదాలను ఉదహరించాడు. మనం క్రికెట్‌లో క్యాచ్‌ను డ్రాప్‌ చేసినా, స్టంపింగ్‌ మిస్‌ చేసినా అది మ్యాచ్‌పై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. అది గేమ్‌ స్థితి గతుల్నే మార్చుతుంది. ఇప్పుడు కరోనా వైరస్‌ కట్టడిలో మనం ఏ తప్పు చేసినా అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నాడు. దయచేసి ఎవరూ నియమ నిబంధనల్ని ఉల్లంఘించి కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటానికి విఘాతం కల్గించవద్దని విన్నవించాడు. 

ఢిల్లీలోని కరోనా పాజిటివ్‌ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 2,081చేరగా,  45 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే మే 3 వరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. కాగా, భారత్‌లో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 18,601కి చేరింది. కరోనా నుంచి 3,252 మంది కోలుకున్నారని, 590 మంది మృతిచెందారని తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో 14,759 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు పేర్కొంది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 4,666 కరోనా కేసులు నమోదు కాగా, 232 మంది మృతిచెందారు. (క్రికెట్‌ ఎలా కొనసాగాలి!)

మరిన్ని వార్తలు