అతనొక గేమ్‌ ఛేంజర్‌: గంగూలీ

15 Oct, 2018 15:20 IST|Sakshi

కోల్‌కతా: టీమిండియా యువ క్రికెటర్లు రిషబ్ పంత్, పృథ్వీ షా మెరుపు ఇన్నింగ్స్‌లతో తమదైన మార్కును చూపెడుతున్నారు.. ఇటీవల ఇంగ్లండ్‌పై అరంగేట్రం సిరీస్‌లోనే సెంచరీ బాది 21ఏళ్ల వికెట్ కీపర్ రిషబ్ పంత్ వెలుగులోకిరాగా.. ఆదివారం వెస్టిండీస్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో శతకంతో పాటు టాప్ స్కోరర్‌గా నిలిచి 18 ఏళ్ల పృథ్వీ షా తన అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. అయితే.. ఈ ఇద్దరిలో మ్యాచ్‌ని మలుపు తిప్పే సామర్థ్యం ఎవరికి ఉంది..? అని మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీని ప్రశ్నించగా రిషబ్‌ పంత్‌కే ఓటేశాడు.

‘రిషబ్ పంత్ క్రీజులో చాలా ఉత్సాహంగా కనిపిస్తాడు. అతని ఆట కూడా సహజసిద్ధంగా ఉంటుంది. అన్ని ఫార్మాట్లలోనూ మ్యాచ్‌ని మలుపు తిప్పగలిగే సామర్థ్యం అతనికి ఉంది. అతనొక గేమ్‌ ఛేంజర్‌’ అని గంగూలీ ప్రశంసించాడు. వెస్టిండీస్‌తో రాజ్‌కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో  92 పరుగులు చేసిన రిషబ్ పంత్.. ఉప్పల్‌లో ముగిసిన రెండో టెస్టులోనూ  సరిగ్గా 92 పరుగుల వద్దే ఔటయ్యాడు. ఈ రెండు సందర్భాల్లోనూ అతను సెంచరీలను చేజార్చుకున్నా...బౌండరీలు బాదిన తీరు అతని దూకుడుకు అద్దం పడుతోంది.

>
మరిన్ని వార్తలు