రిటైర్మెంట్ ఆలోచనే లేదు

4 Sep, 2013 01:51 IST|Sakshi
రిటైర్మెంట్ ఆలోచనే లేదు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన లేదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో దాని గురించి ఆలోచించడం లేదు కాబట్టి వీడ్కోలు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పాడు. మొత్తానికి 200వ టెస్టు మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ అవుతాడని వస్తున్న ఊహాగానాలకు మాస్టర్ తెరదించాడు. ‘రిటైర్మెంట్‌కు తొందరేముంది. నా కెరీర్ మొత్తంలో ఏనాడూ తొందరపడలేదు. ఇలానే ఉన్నా. ప్రస్తుతం నా దగ్గర ఉన్న ఫార్ములా కూడా అదే’ అని సచిన్ తెలిపాడు. తాను దేవుడ్ని కాదని కేవలం క్రికెటర్‌ని మాత్రమేనని అన్నాడు. ‘ నేను భగవంతుడ్ని కాను. కేవలం క్రికెట్ ఆడతా. దేవుని ఆశీస్సుల వల్లే నా జీవితంలో ఇదంతా సాధించా. కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు. నేను కూడా తప్పులు చేస్తా. చేయకపోతే ఎప్పుడూ అవుట్ కాను. కాబట్టి నా ఆట వరకు నేను ఆడతా. మ్యాచ్‌కు ముందు కొంత మేరకు సన్నద్ధమవుతా’ అని మాస్టర్ వెల్లడించాడు. ఎన్నో వివాదాలతో ముడిపడి ఉన్న క్రికెట్‌లో సుదీర్ఘకాలంగా అభిమానుల ఆశలను మోయడంపై స్పందిస్తూ... ‘జీవితాన్ని చాలా సాధారణంగా ఉండేటట్లు చూసుకుంటా. నా స్కూల్ రోజుల నుంచి చాలా తక్కువగా సంబరాలు చేసుకునేవాణ్ని.
 
  ఏదైనా సాధిస్తే దేవుడికి మిఠాయి ఆఫర్ చేసేవాణ్ని. ఎలాగూ మ్యాచ్ గురించి ప్రజలు మాట్లాడుకుంటారు కాబట్టి నీవు ముందుకు సాగిపో అని నా సోదరుడు ఎప్పుడూ చెబుతుంటాడు. నాది సమతుల్యమైన జీవితం’ అని ఈ ముంబైకర్ పేర్కొన్నాడు. తన తండ్రి మరణంతో కఠినమైన దశను ఎదుర్కొన్నానని చెప్పాడు. ‘1999లో నా తండ్రిని కోల్పోయాను. ఇప్పటికి చాలా ఏళ్లయింది.  సమయం దొరికినప్పుడు పాత జ్ఞాపకాలను రివైండ్ చేసుకుంటే మా తండ్రి గుర్తుకు వస్తారు. కానీ జరిగిన దాన్ని మార్చలేం కదా’ అని సచిన్ వ్యాఖ్యానించాడు. యువకుడిగా ఉన్నప్పుడు మారుతీ 800 తన కలల కారు అని చెప్పాడు.
 

మరిన్ని వార్తలు