భారత్ శుభారంభం

19 May, 2014 01:12 IST|Sakshi
భారత్ శుభారంభం

కెనడాపై 5-0తో క్లీన్‌స్వీప్
  సైనా, సింధు విజయం
 పురుషుల జట్టుకు నిరాశ
 థామస్, ఉబెర్ కప్ టోర్నీ
 
 న్యూఢిల్లీ: అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత మహిళల జట్టు ఉబెర్ కప్ ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేసింది. ఆదివారం మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా జరిగిన గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 0-0తో కెనడాను ఓడించింది. మూడు సింగిల్స్‌లలో భారత క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పి.వి.సింధు, పి.సి.తులసీ తమ ప్రత్యర్థులపై అలవోకగా నెగ్గారు. డబుల్స్ మ్యాచ్‌ల్లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప; సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె జోడీలు గెలుపొందాయి. సైనా 21-14, 21-12తో జాయ్‌సిలిన్‌పై; సింధు 21-16, 21-3తో రాచెల్ హోండెరిచ్‌పై; తులసీ 21-11, 21-13తో టామ్ బ్రిట్నీలపై విజయం సాధించారు. జ్వాల-అశ్విని జోడి 21-11, 21-12తో అలెక్స్ బ్రూస్-చాన్ ఫిలిస్ ద్వయంపై; సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె జంట 20-22, 21-18, 21-16తో గావో గ్రేస్-రాచెల్ హోండెరిచ్ జోడిపై నెగ్గాయి. సోమవారం జరిగే మ్యాచ్‌లో హాంకాంగ్‌తో భారత్ పోటీపడుతుంది.
 
 మరోవైపు థామస్ కప్‌లో భారత పురుషుల జట్టుకు తొలి లీగ్ మ్యాచ్‌లో నిరాశ ఎదురైంది. మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 1-4తో ఓటమి పాలైంది. రెండు సింగిల్స్‌లలో కిడాంబి శ్రీకాంత్ 19-21, 12-21తో ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ చేతిలో; పారుపల్లి కశ్యప్ 13-21, 6-21తో వీ ఫెంగ్ చోంగ్ చేతిలో ఓడిపోయారు.
 
 మూడో సింగిల్స్‌లో గురుసాయిదత్ 21-18, 13-21, 21-19తో డారెన్ లూపై గెలిచాడు. అయితే డబుల్స్ మ్యాచ్‌ల్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం 14-21, 11-21తో బూన్ హోంగ్ తాన్-థియెన్ హూ హూన్ జోడి చేతిలో; అక్షయ్ దివాల్కర్-ప్రణవ్ చోప్రా జంట 17-21, 21-14, 14-21తో షెమ్ గో-వీ కియోంగ్ తాన్ ద్వయం చేతిలో ఓడిపోయాయి. సోమవారం జరిగే మ్యాచ్‌లో కొరియాతో భారత్ ఢీ కొంటుంది.
 

మరిన్ని వార్తలు