బిడ్డలాంటి ఆమెతో సహజీవనమా? ద్యుతీ తల్లి ఫైర్‌

20 May, 2019 19:34 IST|Sakshi

న్యూఢిల్లీ : బంధువైన ఓ టీనేజర్‌తో సహజీవనం చేస్తున్నానని సంచలన ప్రకటన చేసిన భారత రన్నర్‌ ద్యుతీ చంద్‌పై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ద్యుతీని బెదిరించి, బ్లాక్‌మెయిల్‌ చేసి అలా చెప్పించారని ఆమె సోదరి ఆరోపించగా.. గే సెక్స్‌ను అంగీకరించేది లేదని ద్యుతీ తల్లి అఖోజీ చంద్‌ కరాఖండిగా చెప్పారు. ద్యుతీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి నాకు మనవరాలు అవుతుంది. నా మేనకోడలు కూతురు ఆమె. ఆ అమ్మాయికి ద్యుతీ తల్లిలాంటిది. అలాంటి ఆమెతో పెళ్లి ఎలా సాధ్యమవుతోంది. ఇది ఒడిశా సమాజం ఎలా అంగీకరిస్తోంది. ఈ బంధాన్ని అంగీకరించనని ద్యుతీకి నేను గట్టిగా చెప్పాను. దీనికి ఆమె హైకోర్టు అనుమతిచ్చిందని తెలిపింది. నేను బతికుండాగానే నీవు కోర్టు ఆదేశాలు పాటిస్తున్నావా?అని అడిగాను. దీనికి అవును.. కోర్టు అనుమతి ఉంది.

నీవు సపోర్ట్‌ చేసినా చేయకపోయినా పర్లేదు.. నాకు సహాయక సిబ్బంది మద్దతు ఉందని పేర్కొంది. నేను ఏవరు సపోర్ట్‌ చేస్తున్నారని అడిగాను. దీనికి ఆమె వారి మద్దుతుతో ఏమైనా చేస్తానని చెప్పింది. నేను వారితో ఒకసారి మాట్లాడుతానని చెప్పాను. దీనికి ఆమె అంగీకరించలేదు. దీంతో నేను నా పెద్ద కూతురిని వారి దగ్గరకు తీసుకెళ్లమన్నాను. మేం వారి దగ్గరికి వెళ్లేసరికే వారు అక్కడ లేరు.  ద్యుతీ ఆటపై దృష్టి పెట్టడమే నాకు ప్రభుత్వానికి కావాల్సింది. దేశం కోసం ఆడుతున్న ద్యుతీకి రాష్ట్ర ప్రభుత్వం చాలా డబ్బు ఇచ్చింది. ద్యుతీ వారి తల్లిదండ్రుల పేరు నిలబెట్టకపోయినా పర్లేదు.. కానీ తన ఆటద్వారా దేశ గౌరవాన్ని మాత్రం కాపాడాలి.’ అని అఖోజీ చంద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చినప్పటికీ తమ గ్రామం మాత్రం ఇలాంటి బంధాలను అంగీకరించదని ద్యుతీ బంధువు ఒకరు అభిప్రాయపడ్డారు.

అమ్మాయితో సహజీవనం చేస్తున్నా: ద్యుతీ చంద్‌

మరిన్ని వార్తలు