బౌలింగ్‌ కోచ్‌ రేసులో సునీల్‌ జోషి

6 Aug, 2019 16:34 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు బౌలింగ్‌ కోచ్‌ పదవికి మాజీ స్పిన్నర్‌ సునీల్‌ జోషి దరఖాస్తు చేసుకున్నాడు. దాదాపు రెండున్నరేళ్లు బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ కోచ్‌గా పని చేసిన జోషి.. భారత బౌలింగ్‌ కోచ్‌ రేసులోకి వచ్చాడు. భారత బౌలింగ్‌ కోచ్‌ విషయంలో స్పిన్‌ బౌలింగ్‌లో అనుభవమున్న వారికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నదని బలంగా నమ్ముతున్న సునీల్‌ జోషి అందుకు దరఖాస్తు చేశాడు. ‘ అవును.. నేను టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ కోసం దరఖాస్తు చేశా. నేను ఇప్పటికే బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ కోచ్‌గా నా వంతు పాత్ర సమర్ధవంతంగా నిర్వర్తించా. తదుపు చాలెంజ్‌కు సిద్ధంగా ఉన్నా. భారత్‌కు స్పెషలిస్టు స్పిన్‌ కోచ్‌ అవసరం లేదనే విషయం నాకు తెలుసు. కాకపోతే స్పిన్‌లో అనుభవమున్న నన్ను బౌలింగ్‌ కోచ్‌గా ఎంపిక చేస్తారని నమ్ముతున్నా’ అని జోషి తెలిపాడు.

‘పలు అంతర్జాతీ క్రికెట్‌ జట్లు స్పెషలిస్టులను ఎంపిక చేసుకుంటూ ఉంటాయి. దాంతోపాటు సపోర్టింగ్‌ స్టాఫ్‌ కూడా ఉంటారు. అందులో పేస్‌ బౌలింగ్‌ కోచ్‌ కానీ స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌ కానీ ఉంటారు. భారత్‌ క్రికెట్‌ జట్టు కూడా బౌలింగ్‌ కోచ్‌ అవసరం. అది స్పిన్‌ బౌలర్‌ కానీ, పేస్‌ బౌలర్‌ కానీ కావొచ్చు. అందుకు నేను కూడా బౌలింగ్‌ కోచ్‌ పదవి రేసుకు పోటీ పడటం తప్పులేదు’ అని జోషి పేర్కొన్నాడు. 1996-2001 మధ్య కాలంలో భారత క్రికెట్‌ జట్టు ప్రాతినిథ్యం వహించిన జోషి 15 టెస్టుల్లో 41 వికెట్లు సాధించాడు. ఇక వన్డేల్లో 69 వికెట్లు తీశాడు.  తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 160 గేమ్స్‌ ఆడి 615 వికెట్లు సాధించాడు.

 

మరిన్ని వార్తలు