రాష్ట్ర జట్టుకు మూడో స్థానం

31 May, 2014 00:47 IST|Sakshi

భారత స్కూల్ బ్యాడ్మింటన్ టోర్నీ
 ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జాతీయ స్కూల్ అండర్-14 బాలుర బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు మూడో స్థానం లభించింది. బాలుర వ్యక్తిగత సింగిల్స్‌లో ప్రవీణ్ కృష్ణ సత్తా చాటాడు. ఆగ్రాలో ఇటీవల ఈపోటీలు జరిగాయి. బాలుర వ్యక్తిగత సింగిల్స్ విభాగంలో టి.ప్రవీణ్ కృష్ణ (ఖమ్మం) రన్నరప్‌గా నిలిచి రజత పతకాన్ని గెల్చుకున్నాడు.
 
 అలాగే బాలుర టీమ్ విభాగంలో ఖమ్మంకు చెందిన టి.ప్రవీణ్ కృష్ణ, కె.వరప్రసాద్, ఎం.తరుణ్‌లతో కూడిన జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం అందుకుంది. ప్రవీణ్ కృష్ణ చైనాలో జరిగే అంతర్జాతీయ స్కూల్ అండర్-14 బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికయ్యాడు.   పతకాలను గెల్చుకున్న క్రీడాకారులను రాష్ట్ర స్కూల్ విద్యా శాఖ కమిషనర్ ఎం.జగదీశ్వర్, జాయింట్ డెరైక్టర్ వి.ఎస్.భార్గవ్, రాష్ట్ర స్కూల్ గేమ్స్ సమాఖ్య కార్యదర్శి విజయారావులు అభినందించారు.
 

మరిన్ని వార్తలు