రోహిత్‌సేన ఓటమికి కారణాలు ఇవేనా?

11 Feb, 2019 09:38 IST|Sakshi

హామిల్టన్‌ : గత మూడు నెలలుగా సాగుతున్న ఆస్ట్రేలియా–న్యూజిలాండ్‌ పర్యటనను మరింత గొప్పగా ముగించి... టీ20 సిరీస్‌ను ఒడిసిపట్టి సగర్వంగా స్వదేశానికి చేరాలని భావించిన టీమిండియాకు ఆఖరి మ్యాచ్‌లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో భారత్‌ 4 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆఖరి వరకు పోరాడిన రోహిత్‌ సేన తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. అయితే ఈ ఓటమి రోహిత్‌ సేన స్వయంకృతాపరాదమేనని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా రెండు తప్పిదాలు భారత గెలుపును దూరం చేశాయని అభిప్రాయపడుతున్నారు.(చదవండి: ఆఖరి ఆట అపజయంతో...)

1. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోవడం..
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రోహిత్‌ శర్మ.. ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఇది ఎంత ఘోరతప్పిదమో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఆటతో అర్ధమైంది. పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరించే పిచ్‌పై ఏ కెప్టెన్‌ అయినా బ్యాటింగ్‌కే మొగ్గు చూపుతాడు.  పైగా కివీస్‌ జట్టులో భీకరమైన బ్యాట్స్‌మెన్‌ కొలిన్‌ మున్రో, సీఫెర్ట్‌లను దృష్టిలో ఉంచుకొని కూడా ఈ పిచ్‌ విషయంలో ఫీల్డింగ్‌ తీసుకోవడానికి వెనకడుగేస్తారు. కానీ రోహిత్‌ ఇవేవి పట్టించుకోకుండా అనూహ్యంగా ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో కివీస్‌ 212 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసింది. (చదవండి: ధోని దేశభక్తి!)

2. చెత్త ఫీల్డింగ్‌..
రోహిత్‌ నిర్ణయం గెలుపు అవకాశాలను దెబ్బతీస్తే.. ఆటగాళ్ల ఫీల్డింగ్‌ వైఫల్యం బౌలర్లను కోలుకోకుండా చేసింది. గత కొన్నేళ్లుగా ఫీల్డింగ్‌లో అదరగొడుతున్న టీమిండియా ఈ మ్యాచ్‌లో మాత్రం దారుణంగా విఫలమైంది. కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఇచ్చిన సునాయస క్యాచ్‌లను ఆటగాళ్లు జారవిడిచారు. ఈ మిస్‌ ఫీల్డ్‌తో అసహనానికి గురైన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తన నెత్తిని బాదుకున్నాడంటే ఫీల్డింగ్‌ ఎంత చెత్తగా ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా దాటిగా చెలరేగిన కొలిన్‌ మున్రోకు పదేపదే అవకాశం ఇవ్వడం భారత్‌ కొంపముంచింది. క్యాచ్‌లు జారవిడచడమే కాకుండా మిస్‌ ఫీల్డ్‌తో పరుగులు కూడా సమర్పించుకున్నారు. (చదవండి : నెత్తికొట్టుకున్న పాండ్యా!)

ప్రయోగాలు సక్సెస్‌..
ఈ మ్యాచ్‌ విషయంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నిర్ణయాన్ని తప్పుబట్టలేం. ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌నకు ముందు మైదానంలోని అన్ని రకాల పరిస్థితులను చూసేందుకే ఫీల్డింగ్‌ ఎంచుకున్నట్లు మ్యాచ్‌ అనంతరం అతను స్పష్టం చేశాడు. ఈ విషయంలో రోహిత్‌ సక్సెస్‌ అయ్యాడు. మ్యాచ్‌ ఓడినా భారత ఆటగాళ్ల పోరాట పటిమ ఆకట్టుకుంది. అటు టీమ్‌ మెనేజ్‌మెంట్‌ కూడా ఈ సిరీస్‌ను సన్నాహకంగా మాత్రమే భావించింది. ఈ నేపథ్యంలోనే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి విశ్రాంతినిచ్చి రిజర్వ్‌బెంచ్ ఆటగాళ్లను పరీక్షించింది. (చదవండి: ఆ బాల్‌ వైడ్‌గా ఇచ్చుంటే..)

ముఖ్యంగా ఈ సిరీస్‌ ద్వారా ఆల్‌రౌండర్స్‌ విజయ్‌ శంకర్‌, కృనాల్‌ పాండ్యాలు తెరపైకి వచ్చారు. విజయ్‌ శంకర్‌ తనలోని సత్తా చాటాడు. భారీ షాట్లను ఆడగలనని నిరూపించుకున్నాడు. కృనాల్‌ సైతం అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. చివరి మ్యాచ్‌లో దారళంగా పరుగులిచ్చినప్పటికీ.. బ్యాటింగ్‌లో పరిస్థితుల దగ్గట్లు ఆడుతూ ఆకట్టుకున్నాడు. దినేశ్‌ కార్తిక్‌ కూడా ప్రపంచకప్‌ రేసులో ఉన్నానని గుర్తు చేశాడు. మొత్తానికి భారత్‌ ఓ ఛాంపియన్‌ జట్టులా కనిపిస్తోంది. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో మంచి బలాన్ని ప్రదర్శించింది.

మరిన్ని వార్తలు