రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్లో టాప్ సీడ్గా బరిలోకి దిగిన మహిళల టెన్నిస్ డబుల్స్ జోడీ సెరెనా విలియమ్స్-వీనస్ విలియమ్స్లకు ఆదిలోనే చుక్కెదురైంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి జరిగిన తొలి రౌండ్ పోరులో లియమ్స్ జోడి 3-6, 4-6 తేడాతో చెక్ రిపబ్లిక్ జంట లూసీ సఫరోవా-బార్బోరా స్ట్రైకోవా చేతిలో పరాజయం చవిచూసింది. దీంతో ఇప్పటివరకూ ఒలింపిక్స్లో ఓటమి ఎరుగని విలియమ్స్ జోడికి తొలిసారి చేదు అనుభవం ఎదురైంది.
అంతకుముందు ఒలింపిక్స్ బరిలోకి దిగిన మూడు సార్లు(2000,08, 12) స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ అమెరికా జోడీ .. రియోలో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టడం గమనార్హం. దీంతో రియోకు ముందు వరకూ 15-0 తో ఉన్న సెరెనా జోడి ఒలింపిక్ కెరీర్ రికార్డుకు బ్రేక్ పడింది. గత నెల్లో జరిగిన వింబుల్డన్ టైటిల్ ను గెలవడం ద్వారా 14 వ గ్రాండ్ స్లామ్ డబుల్స్ చాంపియన్షిప్ను సెరెనా ద్వయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, మహిళల సింగిల్స్ లో సెరెనా తొలి రౌండ్లో విజయం సాధించి తదుపరి రౌండ్ కు చేరింది.