టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, తన డిప్యూటీ రోహిత్ శర్మల మధ్య విభేదాలు తలెత్తాయంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కోహ్లిని, అతడి భార్య అనుష్కను సోషల్ మీడియాలో రోహిత్ అన్ఫాలో చేయడం, అనుష్క కూడా ఇదే రీతిలో స్పందించడం తదితర పరిణామాల నేపథ్యంలో ఈ రూమర్లకు బలం చేకూరింది. ఈ క్రమంలో విండీస్ టూర్ నిమిత్తం బయల్దేరే ముందు జట్టు కోచ్ రవిశాస్త్రితో కలిసి మీడియాతో మాట్లాడిన కోహ్లి.. జట్టులో అంతా బాగానే ఉందని స్పష్టతనిచ్చాడు. ఎవరో కావాలనే పని గట్టుకుని మరీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అసహనం ప్రదర్శించాడు. అవకాశం వచ్చినప్పుడల్లా రోహిత్ శర్మను ప్రశంసలతో ముంచెత్తాను. నాలో అభద్రతాభావం ఉంటే ఇలా చేసేవాడినా? అంటూ ఆవేదన చెందడంతో వీరిద్దరి మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని అభిమానులు ఓ అంచనాకు వచ్చారు.
ఈ నేపథ్యంలో తాజాగా కోహ్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో రోహిత్ అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తోంది. వెస్టిండీస్తో జరుగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా కోహ్లి సేన ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్వ్వాడ్ అంటూ టీమిండియా ఆటగాళ్లతో కూడిన ఫొటోను కోహ్లి ట్విటర్లో షేర్ చేశాడు. ఇందులో రవీంద్ర జడేజా, భువీ, రాహుల్ తదితర ఆటగాళ్లు అందరూ ఉన్నారు గానీ రోహిత్ మాత్రం కనిపించలేదు. దీంతో...‘ హే కోహ్లి మా మధ్య అంతా బాగానే ఉందని చెప్పావు. ప్రతీసారీ నువ్వు షేర్ చేసే ఫొటోలో రోహిత్ కూడా ఉంటాడు కదా. మరి ఇప్పుడేం అయ్యింది. రోహిత్ ఎక్కడ. రోహిత్లేని స్క్వాడ్ ఎప్పటికీ పరిపూర్ణం కాదు’ అంటూ రోహిత్ అభిమానులు కోహ్లిపై మండిపడుతున్నారు. కాగా భారత్- వెస్టిండీస్ల మధ్య శనివారం తొలి టీ20 మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే.
SQUAD 👊💯 pic.twitter.com/2uBjgiPjIa
— Virat Kohli (@imVkohli) August 2, 2019