బీసీల రాజకీయ సమాధికి కుట్ర

6 Mar, 2019 10:02 IST|Sakshi
మాట్లాడుతున్న జాజుల శ్రీనివాస్‌గౌడ్‌

బీసీ రిజర్వేషన్లు 34నుంచి 22శాతానికి తగ్గించడమే నిదర్శనం

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌

యాదగిరిగుట్ట (ఆలేరు) : తెలంగాణలో బీసీలను రాజకీయ సమాధి చేసేందుకు కుట్ర జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. యాదగిరిగుట్టలో మంగళవారం సా యంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 56శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను తగ్గించడమే ఇందుకు నిద్శనమన్నారు. బీసీ కులాల ఆశీర్వాద సభలు పెట్టి బీసీల ఓట్లతో కేసీఆర్‌ రెండోసారి అధికారంలోకి వచ్చారని పేర్కొన్నారు. బీసీ ఓట్లతో గెలిచిన సీఎం కేసీఆర్‌.. ఆ బీసీ కులాలకే అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

మురళీధర్‌రావు, అనంతరామన్‌ కమిషన్‌ సిఫారసుల ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను 34శాతం పెట్టారన్నారు. సీఎం కేసీఆర్‌ మాత్రం 56శాతం సిలింగ్‌ అని చెప్పి 34శాతాన్ని 22శాతానికి తగ్గించడంతో సుమారు 2వేల మంది బీసీలు సర్పంచ్‌ల పదవులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో  5శాతం ఉన్న  రెడ్డి సామాజిక వర్గానికి 6 మంత్రి పదవులు కేటాయించి.. 56శాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.  

బీసీ రిజర్వేషన్‌ తగ్గించడాన్ని నిరసిస్తూ త్వరలోనే ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వరకు బీసీల ఆత్మగౌరవ పోరు గర్జన పేరుతో పాదయాత్ర చేస్తామన్నారు. ఈనెల 10వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాధూరి అచ్చయ్య, మైలార్‌గూడెం సర్పంచ్‌ కాధూరి రజిత శ్రీశైలం, నాయకులు మంత్రి రాజు, పేరపు రాములు, అక్కినపల్లి వెంకటరత్నం, యువజన సంఘం అధ్యక్షుడు మధు, మాటూరి అశోక్, చిరిగె శ్రీనివాస్, రేగు నర్సింహ, నల్లమాస శేఖర్, కాధూరి వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు