లింగోజిగూడ: మురుగునీరు రోడ్లపైకి వస్తుండడంతో స్థానికుల ఇబ్బందులను తొలగించేందుకు గురువారం హయత్నగర్ కార్పొరేటర్ సామ తిరుమల్రెడ్డి రంగంలోకి దిగారు. హయత్నగర్ డివిజన్ పరిధిలోని నర్సింహారావునగర్, శారదానగర్ జంక్షన్ వద్ద గడ్డిపొలాల యజమానులు డ్రైనేజీ మ్యాన్హోల్ను ధ్వంసం చేయడంతో మురుగునీరు పొంగి రోడ్లపైకి వస్తోందని అధికారులకు విన్నవించినా వారు పట్టించుకోలేదని కార్పొరేటర్ తిరుమల్రెడ్డి తెలిపారు. ప్రజల ఇబ్బందులను తాత్కాలికంగా తొలగించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో కాల్వలోకి దిగి శుభ్రం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సమస్య శాశ్వత పరిష్కారానికి అధికారులు డ్రైనేజీ మ్యాన్హోల్ను నిర్మించాలని ఆయన కోరారు.