దిశ: హైదరాబాద్‌కు చేరుకున్న జ్యుడీషియల్‌ కమిటీ

3 Feb, 2020 13:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన జ్యుడీషియల్‌ కమిటీ హైదరాబాద్‌కు చేరుకుంది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాల గురించి ఆరా తీసే క్రమంలో... నిందితుల పోస్టుమార్టం రిపోర్టు, రీ పోస్టుమార్టం నివేదికలను కమిటీ పరిశీలించనుంది. అదే విధంగా ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్‌) నుంచి వివరాలు సేకరించనుంది.

జ్యుడీషియల్‌ కమిటీకి సిట్‌ నివేదిక
హైకోర్టు సీ బ్లాక్‌ కేంద్రంగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్‌ ఎంక‍్వైరీ కమిటీ విచారణ చేపట్టిన విచారణ తొలిరోజు ముగిసింది. అడిషనల్‌ డీజీ జితేందర్‌, సిట్‌ చీఫ్‌ మహేష్‌ భగవత్‌ హైకోర్టుకు చేరుకుని, ఎన్‌కౌంటర్‌పై స్టేటస్‌ రిపోర్టను కమిషన్‌కు అందచేశారు.నిందితుల పోస్టుమార్టం రీ పోస్టుమార్టం రిపోర్ట్‌ను కూడా పరిశీలించారు. మూడు రోజుల పాటు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై కమిషన్‌ వివరాలు సేకరించనుంది. నిందితుల కుటుంబ సభ్యులతో పాటు దిశ ఫ్యామిలీ మెంబెర్స్ స్టేట్ మెంట్‌ను కూడా కమిటీ రికార్డ్ చేయనుంది. అలాగే దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను కమిషన్‌ విచారణ చేయనుంది. ఇక హైకోర్టు వేదికగా కమిటీ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో సీఆర్పీఎఫ్‌ బలగాలతో ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. మొదటి రోజు ముగిసిన సుప్రింకోర్టు కమిషన్ విచారణ అనంరరం బస నిమిత్తం నగరంలో తాజ్ హోటల్ కు చేరుకున్నారు.

కాగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ సమీపంలో గతేడాది నవంబరు 27న వెటర్నరీ వైద్యురాలిపై మహ్మద్‌ ఆరిఫ్, జొల్లు నవీన్‌, జొల్లు శివ, చెన్నకేశవులు అనే నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అనంతరం ఆమెపై పెట్రోలు పోసి తగులబెట్టిన విషయం విదితమే. ఈ క్రమంలో నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా వారు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో ఎన్‌కౌంటర్‌ చేసినట్లు వెల్లడించారు. అయితే ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయవాదులు సర్వోన్నత న్యాయస్థాణంలో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. (దిశ: చెన్నకేశవులు భార్యను కలిసిన వర్మ )

ఈ క్రమంలో వీరి పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన జస్టిస్‌ వికాస్‌ శ్రీధర్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలో దర్యాప్తు కమిషన్‌ ఏర్పాటు చేసింది. బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖా ప్రకాశ్‌, సీబీఐ మాజీ చీఫ్‌ కార్తికేయన్‌ ఇందులో సభ్యులుగా ఉంటారని పేర్కొంది. ఈ నేపథ్యంలో కమిటీ సోమవారం తెలంగాణకు చేరుకుంది. కమిటీ సభ్యులు హైకోర్టులోని సీ బ్లాకులో ఉంటూ.. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలు సేకరించనున్నారు.(దిశ ఘటనకి.. సమత కేసుకి అదే తేడా..)

మరిన్ని వార్తలు