సాక్షి, హైదరాబాద్: కోవిడ్.. ఈ పేరు వింటేనే ప్రపంచం హడలిపోతోంది. పొరుగుదేశం చైనాను అతలాకుతలం చేసిన ఈ వైరస్ తొలిరోజుల్లో కేరళకు వచ్చినా, దాన్ని సమర్థంగా ఎదుర్కొన్నాం. తాజాగా హైదరాబాద్లో ఆ మహమ్మారి జాడ బయటపడటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే, ప్రజలెవరూ భయాందోళనలకు గురికావొద్దని.. అప్రమత్తంగా ఉంటే చాలని ప్రభుత్వం సూచిస్తోంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే నియంత్రించొచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.
దగ్గరగా ఉంటేనే సోకుతుంది
మిగతా వైరస్ల తరహాలో కోవిడ్–19 కూడా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. అయితే, ఎక్కడో దూరంగా ఉన్న బాధితుడి నుంచి ఇతరులకు వచ్చే అవకాశం ఉండదు. ఆ వైరస్ సోకినవారికి చేరువగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సంక్రమించే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఈ వైరస్ వస్తే, అదే ఇంట్లో ఉండే మిగతావారికి కూడా ఇది సోకే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. బాధితుడితో కలిసి ఒకే వాహనంలో ప్రయాణించినా, సినిమాహాళ్లు వంటి ప్రదేశాల్లో కలిసి ఉన్నా, ఒకే ఆఫీసులో పనిచేస్తున్నా.. ఈ వైరస్ అతడి నుంచి సంక్రమించే చాన్స్ ఉంటుంది.
కోవిడ్ సోకిన వెంటనే చికిత్స మొదలుపెడితే వెంటనే అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. మన దేశంలో తొలుత ముగ్గురు కేరళ వాసులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. వెంటనే అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై వారికి ప్రత్యేక శ్రద్ధతో చికిత్స ప్రారంభించింది. ఫలితంగా వారు వెంటనే కోలుకోగలిగారు. అయితే, సకాలంలో చికిత్స అందకపోతే వ్యాధి తీవ్రత పెరిగితే చేయి దాటే ప్రమాదం ఉంటుంది. అలాంటివారిలో కొందరికి శ్వాస తీసుకోవటంలో అత్యంత తీవ్రమైన ఇబ్బందులు(సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) ఏర్పడతాయి. న్యుమోనియా, కిడ్నీలు దెబ్బతినే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఇవి చివరకు మరణానికి దారి తీస్తాయి.
వెంటనే గుర్తించాలి
మన దేశంలో సాధారణ జలుబు, జ్వరం, దగ్గు సహజంగా వస్తుంటాయి. వీటికి డాక్టర్ వద్దకు వెళ్లకుండా సొంతంగా మందులు వేసుకుంటూ ఉంటారు. కానీ, ప్రస్తుతం పొడి దగ్గు, జలుబుతో కూడిన జ్వరం ఉంటే మాత్రం ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
పరిశుభ్రతే మందు
కోవిడ్ సోకిన తర్వాత చికిత్స కోసం పరిగెత్తడం కంటే అది రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఈ వైరస్కు ప్రత్యేక చికిత్స లేకపోవటంతో మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
24 రోజుల వరకు బతికుంటుందట..
కోవిడ్ శరీరంలోకి చేరిన రెండు రోజుల నుంచి 12 రోజుల్లో ప్రభావం చూపుతుంది. అనుమానిత లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన తర్వాత 12 రోజుల వరకు దాని లక్షణాలు నిర్ధారణ కాకుంటే, ఇక ఆ వైరస్ ప్రభావం లేదని తేలినట్టే. అయితే, అతి ప్రమాదకర వ్యాధులతో బాధపడేవారిలో మాత్రం దాదాపు 24 రోజుల వరకు వైరస్ బతికే ఉంటుందని, ఆలోపు ఎప్పుడైనా అది వారిపై ప్రభావం చూపించొచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.