కులాంతర వివాహం చేసుకోవటమే నేరమా : సందీప్‌

20 Sep, 2018 08:52 IST|Sakshi
సందీప్‌, మాధవి (పెళ్లి నాటి ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌ : కులాంతర వివాహం చేసుకున్నందుకే తనపై మాధవి తండ్రి మనోహరాచారి క్షక్ష్య గట్టాడని సందీప్‌ ఆరోపించాడు. కులాంతర వివాహం చేసుకున్నారన్న కారణంగా మనోహరాచారి అనే వ్యక్తి ఈ బుధవారం ఎర్రగడ్డలో కూతురు, అల్లుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన కూతురు మాధవి పరిస్థితి విషమంగా ఉండగా అల్లుడు సందీప్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సందీప్‌ మీడియాతో మాట్లాడుతూ.. మాధవి తండ్రి తనను కులంపేరుతో చాలా సార్లు  దూషించాడని అన్నాడు. కులాంతర వివాహం చేసుకోవటమే నేరమా అని ప్రశ్నించాడు. కేవలం కులాంతర వివాహం చేసుకున్నామనే కోపంతో తమపై కత్తితో దాడి చేశాడని తెలిపాడు.

తన భార్య మాధవి తండ్రి ఒక పక్కా ప్లాన్‌తోనే తమపై దాడి చేశాడని పేర్కొన్నాడు. మనోహరాచారి.. కూతురిని చూడాలని ఉంది రమ్ముంటూ ఫోన్‌ చేశాడని, అతడితో మాట్లాడిన తర్వాత తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో తమపై కత్తితో దాడి చేశాడని చెప్పాడు. తాను అక్కడినుంచి తప్పించుకుని వెళ్లిపోయిన తర్వాత మాధవిపై విచక్షణా రహితంగా దాడి చేశాడని తెలిపాడు. 2015లో మాధవి తల్లి తన అంతు చూస్తానంటూ బెదిరించిందని అన్నాడు. మనోహరాచారి మద్యం మత్తులో తమపై దాడి చేశాడని, తనకు న్యాయం కావాలని సందీప్‌ కోరాడు.   

విషమంగానే మాధవి ఆరోగ్య పరిస్థితి

హైదరాబాద్‌ : కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో తండ్రి మనోహరాచారి చేతిలో తీవ్రగాయాలపాలైన మాధవి పరిస్థితి విషమంగానే ఉంది. యశోధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. మరికొంత సమయం గడిస్తే కానీ ఏమీ చెప్పలేమంటున్నారు వైద్యులు. 

మరిన్ని వార్తలు