‘ప్రయాణం’పై వర్షం దెబ్బ!

18 Aug, 2018 02:57 IST|Sakshi

పలు రైళ్లు రద్దు.. మరికొన్నిదారి మళ్లింపు

ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు

రెండోరోజూ పలు విమానాలు రద్దు

సాక్షి, హైదరాబాద్‌: కేరళ, ఇతర ప్రాంతాల్లోని వరదలు, భారీ వర్షాల ప్రభావం ఇంకా తగ్గలేదు. ఫలితంగా ఈ ప్రభావం నగరం నుంచి కేరళకు వెళ్లే.. వివిధ రైళ్లు, విమాన సర్వీసులపై పడింది. శుక్రవారం కూడా పలు రైళ్లు, విమానాలు రద్దయ్యాయి. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా, ఇంకొన్నింటిని దారి మళ్లించారు.

పాక్షికంగా రద్దయిన రైళ్లివే..
సేలం– త్రివేండ్రం  రాకపోకలకు అంతరాయం కలగడంతో హైదరాబాద్‌–త్రివేండ్రం సెంట్రల్‌ శబరి ఎక్స్‌ప్రెస్‌ను సేలం వరకు పరిమితం చేశారు.   కోయంబత్తూరు– ఎర్నాకుళం మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో పట్నా–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లను కొయంబత్తూరు వరకు పరిమితం చేశారు.తిరువనంతపురం– పాలక్కడ్‌ల మధ్య వరదల కారణంగా హైదరాబాద్‌ నుంచి శుక్రవారం బయల్దేరాల్సిన హైదరాబాద్‌– త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్‌ను తిరుపతి వరకే పరిమితం చేశారు.మంగళూరు–కాచిగూడ మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ను శనివారం తాత్కాలికంగా రద్దు చేశారు.కొల్లాం– విశాఖ మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ను కొల్లాం–కోయంబత్తూరు మధ్య తాత్కాలికంగా రద్దు చేశారు.బనస్‌వాడి– సంబల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే) శుక్రవారం తాత్కాలికంగా రద్దు చేశారు.

వీటిని దారి మళ్లించారు..
ముంబై సీఎస్‌ఎంటీ – కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ– త్రివేండ్రం సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్, కొబ్రా– త్రివేండ్రం సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్, త్రివేండ్రం సెంట్రల్‌ – న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్, కన్యాకుమారి– ముంబై సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్‌లను ఈరోడ్, దిండిగల్, మదురై, తిరునల్వేలి, నాగర్‌కోయిల్‌టౌన్, త్రివేండ్రం సెంట్రల్‌ మీదుగా దారి మళ్లించారు.శ్రీగంగానగర్‌ –హజుర్‌ సాహిబ్‌ ఎక్స్‌ప్రెస్‌ నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ను(ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే) శనివారం కొదియార్, చండ్లోడియా, సబర్మతీ మీదుగా దారి మళ్లించారు.  

సమయ వేళల్లో మార్పులు..
లోకమాన్య తిలక్‌ – కోయంబత్తూరు ఎక్స్‌ప్రెస్‌ (ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే) శుక్రవారం 1.10 గంటలు ఆలస్యంగా బయల్దేరింది. వాతావరణ మార్పుల కారణంగా ఈ మార్పులు జరిగాయని, అసౌకర్యానికి చింతిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.  

కొచ్చికి రద్దయిన విమానాలు..!
కేరళలో కొచ్చి ఎయిర్‌పోర్టు రన్‌వే పూర్తిగా మునిగిపోవడంతో పలు విమాన సర్వీసులు ప్రభావితమయ్యాయి. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి కొచ్చికి వెళ్లాల్సిన 4 విమానాలు నేడు కూడా రద్దయ్యాయి. వరుసగా రెండోరోజూ కొచ్చి వెళ్లాల్సిన విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కొచ్చి విమానాశ్రయంలో రన్‌వే శనివారం మధ్యాహ్నం తర్వాత అందుబాటులోకి వచ్చే అవకాశముందని సమాచారం.

మరిన్ని వార్తలు