కోటి ఎకరాలకు నీళ్లిచ్చి.. నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం

8 Jan, 2019 01:34 IST|Sakshi

సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ కోసం విధి విధానాలు రూపొందించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా గోదావరి, కృష్ణా బేసిన్లలో రాష్ట్రానికి ఉన్న నీటి వాటాను వినియోగించుకునేలా వ్యూహం రూపొందించాలన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తే ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి సాగునీరు అందిస్తారనే విశ్వాసంతో ప్రజలు తమకు మరోసారి అవకాశం ఇచ్చారని.. ప్రజలుంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని ప్రస్తుత పదవీకాలంలో అన్ని ప్రాజెక్టులు నూటికి నూరుశాతం పూర్తి చేస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. అధికారులు, ప్రాజెక్టులు చేపట్టిన సంస్థలు ఇందుకు సహకరించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలోనే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తి చేయాలని సూచించారు.

ప్రాజెక్టుల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పాటు ఇతర ఆర్థిక సంస్థల నుంచి నిధులు సేకరిస్తామన్నారు. ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత వాటి నిర్వహణ కోసం అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయిస్తామని వెల్లడించారు. రైతులకు సాగునీరు ఇవ్వడంతోపాటు పరిశ్రమలకు, తాగునీటికి ఎంత నీరు అవసరమో లెక్కగట్టి, ఏ ప్రాజెక్టు నుంచి ఎంత నీరు వాడాలో నిర్ణయించాలన్నారు. ప్రాజెక్టుల నుంచి వచ్చే నీటితో మొదట చెరువులు నింపడానికే ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం స్పష్టంచేశారు. దీనికోసం ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. ఏ ప్రాంతంలో అయినా ప్రాజెక్టు పనులు పూర్తి కావడానికి ఆలస్యమైనా చెరువులు నింపడానికి కావాల్సిన ఏర్పాట్లు మాత్రం యుద్ధ ప్రాతిపదికన జరగాల్సిందేనన్నారు. 

ఆ ఆశతోనే ఓటేశారు 
సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రగతిభవన్‌లో సాగునీటి ప్రాజెక్టులపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఇటీవలే అన్ని ప్రాజెక్టుల పనులను స్వయంగా సందర్శించి వచ్చిన రిటైర్డు ఇంజనీర్లు, వివిధ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు, ప్రభుత్వ ముఖ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి ప్రాజెక్టు పురోగతిపై రిటైర్డు ఇంజనీర్ల బృందం కేసీఆర్‌కు వివరాలు అందించింది. ఈ సందర్భంగా ఎక్కడ ఏ లోపం ఉందో చర్చించి, అక్కడికక్కడే లోపాన్ని సవరించడానికి అధికారులకు సీఎం కేసీఆర్‌ సూచనలు చేశారు. పనుల్లో జాప్యం జరుగుతున్నచోట, జాప్యానికి కారణాలు తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపారు. అవసరమైతే పనుల్లో నిర్లక్ష్యం వహించే వర్క్‌ ఏజెన్సీ(కాంట్రాక్లర్లు)ని మార్చాలని సీఎం ఆదేశించారు. ‘తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు దశాబ్దాల తరబడి పోరాడారు. ప్రాణాలు అర్పించారు. రాష్ట్రం సాధించుకున్నారు. తెలంగాణ వస్తే సాగునీరు వస్తుందని ఆశ పడ్డారు. గత ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించాం. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరించే పనులు చేపట్టాం.

అన్ని పనులు పురోగతిలో ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, విశ్వసనీయతను ప్రజలు గుర్తించారు. ఈ ప్రభుత్వంతోనే ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవుతుందని ప్రజలు నమ్మారు. 75% మంది ఇదే ఆశతోనే టీఆర్‌ఎస్‌కు మళ్లీ ఓటు వేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించాం. వలసలు పోయిన వారు వాపస్‌ వచ్చారు. ఈ పరిస్థితి చూసే అక్కడి ప్రజలు 13 సీట్లలో టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి తెలంగాణలో కోటి ఎకరాల్లో నీరు పారించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఐదేళ్ల పూర్తి సమయం మనకుంది. రాజకీయ సుస్థిరత ఉంది. నిధులకు కొరతలేదు. రైతులకు సాగునీరు అందివ్వడమే ధ్యేయంగా పనిచేయడానికి పునరంకితమవుదాం. ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటితో ముందుగా చెరువులు నింపాలి. గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను ఉపయోగించుకుని చెరువులను నింపేందుకు చర్యలు చేపట్టాలి. సాగునీటితోపాటు, తాగునీటికి ఎంత నీరు అవసరమవుతుందో భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అంచనాలు తయారు చేసి నీటి కేటాయింపు జరపాలి’అని సీఎం కేసీఆర్‌ సూచించారు. 

నీటి వాటాను వదులుకోవద్దు 
‘గోదావరి నీటిలో తెలంగాణకు 950 టీఎంసీల వాటా ఉంది. సమైక్య రాష్ట్రంలోనే ఇది ఖరారైంది. దీని ప్రకారమే మనం గోదావరిపై కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్, నల్గొండ జిల్లాలకు సాగునీరు అందించాలి. హైదరాబాద్‌కు తాగునీరు అందించాలి. ఇదే లక్ష్యంతో ఆ ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. ఈ ఏడాది ఎండాకాలంలోనే పనులన్నీ పూర్తి చేసి వర్షాకాలంలో ఈ ప్రాజెక్టు నుంచి నీళ్లు చెరువుల ద్వారా పొలాలకు చేరాలి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, కన్నెపల్లి, అన్నా రం, సుందిళ్ల పంపుహౌసుల నిర్మాణం పూర్తి కావాలి. ఎల్లంపల్లి, మిడ్‌ మానేరు దాకా నీళ్లు రావాలి. మేడిగడ్డ నుంచి ప్రతిరోజు రెండు టీఎంసీల చొప్పున నీరు తీసుకోవాలి. మూడు బ్యారేజీలతో 36 టీఎంసీల నీరు, ఎల్లంపల్లిలో 20 టీఎంసీల నీరు నదిలోనే అందుబాటులో ఉంటాయి. వచ్చిన నీటిని వచ్చినట్లు పంపు చేసి చెరువులకు మళ్లించాలి.

ఎల్లంపల్లి దాకా వచ్చిన నీటిలో ఒక టీఎంసీని మిడ్‌ మానేరుతో శ్రీరాంసాగర్‌ కాల్వలకు మళ్లించాలి. మరో టీఎంసీ నీళ్లను మల్లన్నసాగర్‌ వైపు మళ్లించాలి. మల్లన్నసాగర్‌తో ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో నిర్మించే బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్‌కు తరలించాలి. మల్లన్నసాగర్‌తోనే హైదరాబాద్‌ మంచినీళ్ల కోసం నిర్మిస్తున్న 10 టీఎంసీల రిజర్వాయర్‌కు నీరు పంపాలి. హల్ది వాగుతో నిజాంసాగర్, ఘనపురం ఆయకట్టుకు సాగునీరు అందించాలి. గండిపేట, హిమాయత్‌సాగర్‌ చెరువులు నింపాలి. వీటి నుంచి క్రమం తప్పకుండా నీటిని విడుదల చేస్తూ మూసీ మురికిని వదిలించాలి. మూసీ రివర్‌ ఫ్రంట్‌ను అహ్మదాబాద్‌లో సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ తరహాలో అభివృద్ధి చేస్తాం. దానికీ గోదావరి నీళ్లు అందాలి. చివరికి మూసీ నది నీళ్లతో ఉమ్మడి నల్గొండ జిల్లా పొలాలకు నీరు చేరాలి’అని కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాలను వివరించారు. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించి, అమలు చేయాలని ముఖ్యమంత్రి వివరించారు. 

దేవాదులపై సమీక్ష 
‘గోదావరి నదిపై నిర్మించిన దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తిస్థాయిలో సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇంద్రావతి నది గోదావరిలో కలిసిన తర్వాత తుపాకులగూడెం వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఆ నీటిని ఉపయోగించుకోవడానికి బ్యారేజీ కడుతున్నాం. ఏడాదికి 75 టీఎంసీలకు పైగా నీరు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడున్న డిజైన్లు, కాల్వలు, ఇతర నిర్మాణాలు పెద్దగా ఉపయోగపడేలా లేవు. మొత్తం ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు దేవాదులతో నీరందించాలి. పాకాల, రామప్ప, గణపురం, లక్నవరం చెరువులను నింపాలి. తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక రిజర్వాయర్‌ నిర్మించి తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ తదితర నియోజకవర్గాలకు నీరివ్వాలి. దీనికోసం మొత్తం ప్రాజెక్టును సమీక్షించి కొత్త ప్రతిపాదనలు తయారు చేయాలి. దుమ్ముగూడెం వద్ద నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలి. మే నెలలోనూ దుమ్ముగూడెం వద్ద గోదావరి నీటితో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు నీరివ్వాలి. బయ్యారం వరకు నీటిని తీసుకురావాలి. ఎస్సారెస్పీ ఆయకట్టుకూ నీరందాలి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన నిర్మాణాలు చేపట్టాలి’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

దేశం ప్రశంసించింది 
‘తెలంగాణ రాష్ట్రం వెనుకబడింది. సాగునీటి రంగంలో వివక్షకు గురైంది. అందుకే ఇక్కడి ప్రజలు పోరాటం చేశారు. తెలంగాణలో ఓ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించండి అని ప్రధానికి అనేకసార్లు చెప్పాను. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.20–30 వేల కోట్లు ఇచ్చి సాయపడండి అని వేడుకున్నా. అయినా ప్రధాని నిధులు ఇవ్వలేదు. మిషన్‌ కాకతీయతో చెరువులు పునరుద్ధరిస్తున్న తీరును చూసి దేశమంతా మెచ్చుకున్నది. వాటర్‌ మాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేందర్‌ సింగ్‌ వరంగల్‌ జిల్లా నెక్కొండ చెరువులో పుట్టినరోజు చేసుకుని మిషన్‌ కాకతీయ పనులను మెచ్చుకున్నారు. దేశమంతా ప్రశంసించింది. నీతి ఆయోగ్‌ కూడా మిషన్‌ కాకతీయ గొప్ప పథకమని చెప్పింది. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథలకు రూ.24 వేల కోట్లివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయినా.. నరేంద్ర మోదీ రూ.24 కూడా ఇవ్వలేదు. ఈసారి కేంద్రంలో మనది క్రియాశీల పాత్ర ఉంటుంది. కావాల్సిన నిధులు రాబట్టుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మన రాష్ట్ర ఆదాయాభివృద్ధి రేటు బాగుంది. మొదటి నాలుగేళ్లలో 17.17% వృద్ధిరేటు ఉంటే.. ఈ ఏడాది ఇప్పటి వరకు 29.17% వృద్ధి రేటు నమోదైంది. నిధులకు కొరతలేదు. ప్రాజెక్టులు కట్టుకోవడమే మన లక్ష్యం’అని చెప్పారు. 

పాలమూరు వేగం పెంచండి 
‘ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి (ప్రస్తుత వికారాబాద్‌) జిల్లాలకు సాగునీరు అందివ్వడానికి ఉద్దేశించిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వేగం పెరగాలి. పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయడంతో మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజల్లో ప్రభుత్వంపై ఎంతో నమ్మకం వచ్చింది. పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి మహబూబ్‌నగర్‌ జిల్లాను సస్యశ్యామలం చేయాలి. శ్రీశైలం వనరుల నుంచి నుంచి 70 టీఎంసీల వరకు తీసుకునే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజలకు ఎంతో మేలు చేసే ఈ ప్రాజెక్టును ఆ జిల్లాకు చెందిన రాజకీయ నాయకులే కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారు. దీంతో కొంత జాప్యం జరిగింది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నంత వేగంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం సాగాలి. అవసరమైన నిధులను ఈ బడ్జెట్లోనే కేటాయిస్తాం’అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్, నీటి పారుదల శాఖ ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్‌లు మురళీధర్‌రావు, అనిల్‌కుమార్, హరిరామ్, ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే, సలహాదారు పెంటారెడ్డి, సీఈలు వెంకటేశ్వర్లు, జి.శ్రీనివాసరెడ్డి, బి.శంకర్, కె.బంగారయ్య, వి.సుధాకర్, వి.నరసింహ, ఆర్‌.మధుసూదన్‌రావు, వి.రమేశ్, టి.ఖగేందర్, రిటైర్డు ఇంజనీర్లు శ్యాం ప్రసాద్‌రెడ్డి, చంద్రమౌళి, వెంకటరామారావు, వేణుగోపాలరావు, రాంరెడ్డి, దామోదర్‌రెడ్డి, వెంకటేశం, సత్తిరెడ్డి, రమణ నాయక్, ఎస్‌.ముత్యంరెడ్డి, జగదీశ్వర్, జియావుద్దీన్, ఇంద్రసేనారెడ్డి, కెప్టెన్‌ జనార్దన్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు