‘ప్రజల సహకారంతోనే ఆ దేశాలు అభివృద్ది చెందాయి’

18 Sep, 2019 14:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కుకట్‌పల్లి జేఎన్టీయూ యునివర్శిటీ ఆడిటోరియంలో స్వచ్ఛ పాఠశాల, స్వచ్ఛ కమ్యూనిటీ కార్యక్రమాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్‌ బోంతు రామ్మోహన్‌, విద్యాశాఖ కార్యదర్శి డా. బి జనార్దనరెడ్డి, మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ టీకే శ్రీదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి మాట్లాడుతూ.. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో ప్రతి విద్యార్థి పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యాసంస్థలు తమ సంస్థ ఆవరణంలో పరిశుభ్రత పాటించాలని.. తడి, పొడి చెత్తను వేరు చేయటంతో పాటు టాయిలెట్స్‌ క్లీనింగ్‌లో కూడా శుభ్రత పాటించాలని పిలుపునిచ్చారు.

అలాగే ఇంటి  పరిసర ప్రాంతాలను  శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అపరిశుభ్రత వల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి విద్యార్థులు తెలుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం ఇరవై తొమ్మిది లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వారిలో ప్రతిరోజు ముప్పై శాతం మంది అనారోగ్య కారణాలతో స్కూల్‌కు హాజరు కావడం లేదని తెలిపారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా పాఠశాలల పరిశుభ్రతకు పాధాన్యతను ఇస్తున్నాయని అన్నారు. అందుకే పాఠశాలలు, కళాశాలలలో విద్యా  ప్రమాణాలతో పాటు పరిశుభ్రత కూడా అవసరమని, చెత్త లేకుండా చేయడంతో పాటు ప్లాస్టీక్‌ వినిమోగాన్నికూడా తగ్గించాలని ఆయన పేర్కొన్నారు. 

కాగా మేయర్‌ బోంతు రామ్మోహన్‌ కూడా మాట్లాడుతూ.. పాఠశాల, కళాశాలల విద్యార్థులు వారి ఇంటి పరిపరాలను శుభ్రంగా ఉండేలా చుసుకోవాలని అన్నారు. విద్యార్థులు ఎవరైతే  పరిశుభ్రత పట్ల చక్కటి అవగాహన కలిగి ఉంటారో వారు తమని తాము స్వచ్ఛ అంబాసిడర్‌లుగా  భావించుకుంటూ ఆయా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. స్వచ్ఛత పాటించకపోవడం వల్లే నగరంలో దోమలు వ్యాప్తి చెందుతాయని అన్నారు. హైదరాబాద్‌ నగరంలో దాదాపు కోటి మందికి పైగా జనాభా ఉందని, జీహెచ్‌ఎంసీ తరపున ఇరవై వేల మంది మున్సిపాలిటి సిబ్బంది ఉన్నారని ఆయన వెల్లడించారు. అలాగే వీరితో పాటు ప్రజలు కూడా స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టాలని, జపాన్‌, సింగపూర్‌ వంటి దేశాలలో  అభివృద్ది ప్రజల సహకారంతోనే జరిగిందని పేర్కొన్నారు. నగరంలో జీహెచ్‌ఎమ్‌సీ మాత్రమే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతుందని, ఇళ్లలోని చెత్తను నాలల్లో వేసి నిర్లక్ష్యంగా వ్వవహరించోద్దని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉంటూ ఇతురులలో కూడా ఛైతన్యం తీసుకురావాలని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు