ప్రైవేటీకరణపై దండెత్తుదాం

17 Oct, 2019 04:40 IST|Sakshi

చర్చలకు పిలిస్తే అనుసరించాల్సిన వ్యూహంపై జేఏసీ భేటీ 

సాక్షి, హైదరాబాద్‌: సమ్మె విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. తాము చర్చలకు సిద్ధమని మరోసారి తేల్చి చెప్పింది. చర్చలు ఎవరితో జరపాలన్న విషయంలో ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టం చేయకపోవటాన్ని తప్పుపట్టింది. హైకోర్టు స్పందన నేపథ్యంలో జేఏసీ ప్రతినిధులు బుధవారం అత్యవసరంగా భేటీ అయ్యారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయ లేమని ప్రభుత్వం కోర్టుకు కూడా చెప్పడంతో.. ఈ విషయంపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ విషయంలో పట్టుపట్టకుండా, ఆర్టీసీ పరిరక్షణ కోణంలో డిమాండ్‌ చేయాలని కొందరు సభ్యులు అభిప్రాయపడ్డారు. ప్రైవేటీకరణ, అద్దె బస్సుల సంఖ్య పెంపు విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని నిర్ణయించారు. ఆర్టీసీ విలీనం అంశం విషయంలో పట్టువిడుపులతో వ్యవహరించి, ప్రైవేటీకరణ యోచనపై గట్టిగా వాదించాలని నిర్ణయించారు. అనంతరం మద్దతు కూడగట్టుకునేందుకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాజకీయ జేఏసీ సమావేశంలో పాల్గొన్నారు.

చర్చలకు ఆహ్వానించాలి..
కోర్టు సూచనల మేరకు చర్చలకు ఆహ్వానించి ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నా రు. అనంతరం మాట్లాడుతూ.. అరెస్ట్‌ చేసిన ఆర్టీసీ కార్మికులను వెంటనే విడుద చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, ఈ నెల 19న జరిగే ఆర్టీసీ కార్మికుల బంద్‌ను విజయవంతం చేయా లని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం పిలుపునిచ్చారు. అఖిలపక్ష సమావేశం అనంతరం మాట్లాడుతూ.. ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు సమ్మెను విజయవంతం చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు