ప్రచారానికి ‘స్టార్‌ క్యాంపెయినర్లు’

22 Nov, 2018 11:20 IST|Sakshi

సాక్షి, భూపాలపల్లి: నామినేషన్ల పర్వం ముగియడంతో ఇక ప్రచారం ఉధృత రూపం దాల్చింది. ఇప్పటి వరకు ఆయా పార్టీల అభ్యర్థులు, సాధారణ స్థాయి నేతలు ప్రచారం నిర్వహించి మొదటి విడతను పూర్తి చేశారు. మలిదశ ప్రచారమంతా వీఐపీల పర్యటన మధ్య జరగబోతుంది. ఇందులో భాగంగా ఈనెల 19న పాలకుర్తిలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆశీర్వాద సభను నిర్వహించారు. ఈనెల 23న నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, జనగామలో ఆయన ప్రచారం నిర్వహించబోతున్నారు.

తన పర్యటనతో పార్టీలో కొత్త ఉత్సాహం నింపాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, కడియం శ్రీహరి, ఎంపీ కవిత సైతం ఆయా నియోజవకర్గాల్లో పర్యటించనున్నారు. ఇదిలా ఉండగా ఈ పది రోజుల్లో బీజేపీ తరఫున ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆ పార్టీ అధినేత అమిత్‌షా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ రానున్నారని సమాచారం. అలాగే కాంగ్రెస్‌ నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు రాహు ల్‌ గాంధీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఖుష్బూ, విజయశాంతి, రేవంత్‌రెడ్డి ప్రచారంలో పాల్గొనే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీరందరి బహిరంగ సభలతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది.

అగ్ర నేతలపైనే ఆశలు.. 
టీఆర్‌ఎస్‌ తమ పార్టీలోని అగ్రనేతలపైనే ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థులు తమ పరిధిలో పెద్దఎత్తున ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీ సైతం ప్రచార తీవ్రతను పెంచి పోటీ ఉధృతం చేస్తుండడంతో టీఆర్‌ఎస్‌ మరింతగా అప్రమత్తమవుతోంది. ఎలా గైనా గెలవాలన్న లక్ష్యంతో ఆ పార్టీ అగ్రనేతలను రంగంలోకి దించి రాజకీయ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని భావి స్తోంది. తెలంగాణ సెంటిమెంట్, స్వరాష్ట్ర ఉద్యమంలో జరిగిన ద్రోహం, త్యాగాలు, గత నాలుగున్నరేళ్లలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు తోడుగా ప్రస్తుత ఆకర్షనీయ మేనిఫెస్టోతో ఓట్లు రాబట్టాలని టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోంది.

దూకుడు పెంచే దిశగా కాంగ్రెస్‌.. 
ఇక నుంచి ప్రచారాన్ని దూకుడుగా చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ సన్నాçహాలు మొదలు పెట్టింది. ఇందుకోసం పార్టీకి చెందిన అగ్రనేతలందరిని రంగంలోకి  దింపి బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఈ వారం, పది రోజుల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఏదో ఒక చోట ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీచే భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. అలాగే ఈ రెండు, మూడు రోజుల్లో రేవంత్‌ రెడ్డి పర్యటన సైతం ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. సినీనటులు ఖుష్బూ, విజయశాంతి నియోజకవర్గాల్లో నిర్వహించే సభలకు హాజరుకానున్నారు. నాలుగేళ్ల పాలనలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేయలేదని, కుటుంబ పాలన సాగుతోందని ఎండగడుతూ, తాము అధికారంలోకి వస్తే అమలు చేసే మేనిఫెస్టోను సైతం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముందుకు సాగుతున్నారు.

రంగంలోకి బీజేపీ..
బీజేపీ కూడా తమ ఫైర్‌బ్రాండ్లను రంగంలోకి దించి ఓటర్లను ఆకట్టుకోవాలని వ్యూహ రచన చేస్తోంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఆ పార్టీ అధినేత అమిత్‌ షా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, జాతీయ నాయకులు పరిపూర్ణానందస్వామి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర నాయకులను జిల్లాకు రప్పించేందుకు సమాయత్తమవుతున్నారు. అలాగే బీజేపీలో కొనసాగుతున్న సినీనటులను సైతం రంగంలోకి దించాలని యోచిస్తున్నారు.

దీనికి తోడు తమ అనుబంధ సంఘాల్లోని అనర్ఘళంగా మాట్లాడే వారిని ఇక్కడికి రప్పించేం దుకు ప్రయత్నిస్తున్నారు. భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా రాంమాధవ్, పరిపూర్ణానంద స్వామి పాల్గొంటా ర ని చెబుతున్నారు. సోమవారం భూపాలపల్లిలో జరిగిన బీజేపీ సభలోనే వీరిరువురు పాల్గొనాల్సి ఉన్నా అనివార్య కారణాలతో రావడం కుదరలేదని పేర్కొన్నారు. ఇక బీఎల్‌ఎఫ్‌ కూడా అందులోని పార్టీలకు చెందిన ముఖ్యనాయకులతో ప్రచారం నిర్వహిస్తోంది.  

మరిన్ని వార్తలు