దొంగతనానికి వచ్చి.. దుర్మరణం చెందాడు..!

6 Jun, 2019 02:43 IST|Sakshi

హైదరాబాద్‌ : దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి తప్పించుకునే యత్నంలో 3వ అంతస్తు నుంచి దూకి దుర్మరణం చెందాడు. ఈ ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం అర్థరాత్రి జరిగింది.  అనంతపురం జిల్లాకు చెందిన బాలాంజనేయులు అలియాస్‌ బాలు బతుకు దెరువు కోసం నగరానికి వలస వచ్చాడు. పుప్పాలగూడ దుర్గా కాలనీ ప్రాంతంలోని రవీందర్‌ అనే వ్యక్తి వద్ద కొంతకాలం పనిచేశాడు. ప్రస్తుతం ఏ పనీ చేయకుండా  తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో తాను గతంలో పనిచేసిన రవీందర్‌ ఇంటి వద్దకు చోరీకి వచ్చాడు.

ఆ సమయంలో రవీందర్‌ కుటుంబీకులు ఇంటికి తాళం వేసి మిద్దెపై నిద్రిస్తున్నారు. దొంగతనం చేసేందుకు వచ్చిన బాలాంజనేయులు ఆ ఇంటి తాళం విరగ్గొట్టి ఇంట్లోకి వెళ్లగా..అదే సమయంలో మూడో అంతస్తులో అద్దెకు ఉంటున్న ఓ వ్యక్తి చూసి కేకలు వేశాడు. దీంతో బయటకు వచ్చిన బాలాంజనేయులు తప్పించుకునేందుకు మూడో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. ఈ సంఘటనలో తలకు తీవ్ర గాయం కావడంతో మృతి చెందాడు.  

మరిన్ని వార్తలు