ఢిల్లీలో జాతివివక్ష దాడి

1 Feb, 2014 05:37 IST|Sakshi

దెబ్బలు తాళలేక ఎమ్మెల్యే కొడుకు మృతి
 సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచారాల రాజధానిగా ఇప్పటికే అపఖ్యాతిని మూటగట్టుకున్న దేశ రాజధానిపై మరో అపకీర్తి మరక పడింది. ఢిల్లీలోని ఓ ప్రైవేటు యూనివర్సిటీలో బీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన నిడో తానియా (18) అనే యువకుడిపై జాతివివక్ష దాడి జరిగింది. దక్షిణ ఢిల్లీలోని లజ్‌పత్‌నగర్‌లో ఉన్న స్నేహితుడి ఇంటి చిరునామా తెలుసుకోవడానికి తానియా బుధవారం ఇద్దరు దుకాణదారులను సంప్రదించగా వారు అతని జుట్టును చూసి గేలి చేశారు.
 
  కోపం ఆపుకోలేక తానియా...ఓ దుకాణ అద్దాన్ని పగలగొట్టడంతో దుకాణదారులు, మరికొందరు కలసి అతన్ని చితకబాదారు. విషయం పోలీసుల దాకా వెళ్లడంతో వారు రాజీ కుదిర్చి పంపారు. రాత్రి తన గదికి వెళ్లి పడుకున్న తానియా నిద్రలోనే కన్నుమూశాడు. దెబ్బలు తాళలేకే అతను మరణించినట్లు మృతుడి స్నేహితులు, బంధువులు ఆరోపించడంతో ప్రభుత్వం ఇద్దరు దుకాణదారులను అరెస్టు చేసింది. ఈ ఘటనపై మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది. మృతుడు అరుణాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నిడో పవిత్ర కుమారుడు. అతని మరణానికి గల అసలు కారణం పోస్టుమార్టం నివేదిక వచ్చాకే తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు