బ్యాడ్ న్యూస్: మీరు అలా తింటున్నారా?

12 Dec, 2016 14:25 IST|Sakshi
బ్యాడ్ న్యూస్: మీరు అలా తింటున్నారా?
చెన్నై: ఇంట్లో వేసిన మిరపకాయ బజ్జీలు, పుణుగులు, పూరీల లాంటివి బాగా నూనె పీల్చినప్పుడు.. వాటి నుంచి నూనె పోవడానికి న్యూస్‌పేపర్లలో పెడుతున్నారా? రోడ్డు పక్కన బండ్ల మీద ఏదైనా ఆహారం తిన్న తర్వాత చేతులు తుడుచుకోడానికి పాత న్యూస్‌పేపర్లు ఉపయోగిస్తున్నారా.. అలా అయితే మీరు కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. ఎందుకంటే.. అలా చేశారంటే మీ శరీరంలోకి పేపర్ లో వినియోగించే ప్రింట్, పిగ్మెంట్స్, బైండర్స్, అడిటివ్స్ వెళ్తాయని ఫుడ్ సెఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) హెచ్చరించింది. ఇవి మనుషులను తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తాయని చెప్పింది.
 
రీ సైకిల్ చేసిన న్యూస్ పేపర్లలో కూడా ఫ్తాలేట్ అనే రసాయనం మనుషులకు హాని చేస్తుందని తెలిపింది. దీని వల్ల అజీర్తి సమస్యలు, విష ప్రభావం పడుతుందని చెప్పింది. రీ సైకిల్ చేసిన పేపర్లలో ఆహారాన్ని ఉంచి తీసుకోవడం వల్ల వయసుతో సంబంధం లేకుండా అందరికీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువని పేర్కొంది. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కలిగించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా.. ఎఫ్ఎస్ఎస్ఏఐను కోరారు. రోడ్డు పక్కన బండ్ల వద్ద ఆహారాన్ని తీసుకునేప్పుడు న్యూస్ పేపర్లలో ఆహారం ఇస్తే తీసుకోరాదని చెప్పారు. ఈ విషయంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
మరిన్ని వార్తలు