అఫీషియల్‌గా విడిపోయిన సెలబ్రిటీ జంట

7 Jun, 2017 20:39 IST|Sakshi
అఫీషియల్‌గా విడిపోయిన సెలబ్రిటీ జంట

ముంబై: కొంతకాలంగా టీవీ నటి సోనియా కపూర్‌తో రిలేషన్‌లో ఉన్న ప్రముఖ సంగీత దర్శకుడు హిమేష్ రేషమ్మియా అధికారికంగా భార్య నుంచి విడిపోయారు. ముంబై హైకోర్టు విడాకులు మంజూరు చేయడంతో హిమేష్‌- కోమల్‌ దంపతుల 22ఏళ్ల వైవాహిక బంధం ముగిసింది. గత డిసెంబర్‌లో ఈ జంట చేసుకున్న అభ్యర్థనను పరిశీలించిన కోర్టు.. మంగళవారం విడాకులు మంజూరుచేసింది. విచారణ చివరిరోజున స్వయంగా కోర్టుకు హాజరైన హిమేష్‌, కోమల్‌లు.. తాము పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు న్యాయమూర్తికి వివరించారు.

విడాకుల అనంతరం కోర్టు ఆవరణలో హిమేష్‌ రేషమ్మియా మీడియాతో మాట్లాడారు. వైవాహిక బంధంలో పరస్పర గౌరవానికి ప్రాధాన్యం ఉంటుందని, దానిని కొనసాగించేందుకే తామిద్దరం విడిపోయామని హిమేష్‌ చెప్పారు. ‘కోమల్‌తో నాది 22 ఏళ్ల ప్రయాణం. విడాకులు తీసుకోవాలనే మా నిర్ణయాన్ని ఇరు కుటుంబాలూ అంగీకరించాయి. అధికారికంగా విడిపోయినా కోమల్‌కు, ఆమె కుటుంబానికి నేనెప్పుడూ మంచి మిత్రుడిగానే ఉంటా’అని హిమేష్‌ పేర్కొన్నారు.

సోనియా కారణం కాదు
తాము విడిపోవడానికి సోనియా కపూర్‌ కారణం కాదని హిమేష్‌ మాజీ భార్య కోమల్‌ తెలిపారు. విడాకుల అనంతరం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సోనియా వల్లో ఇంకొకరివల్లో నేను నా భర్త(హిమేష్‌) విడిపోలేదు. ఇక ముందు కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలనుకునే విడిపోయాం. హిమేష్‌ ఎప్పటికీ మా కుటుంబ సభ్యుడే’ అని కోమల్‌ లేఖలో తెలిపారు. విడాకుల అనంతరం హిమేష్‌తో కలిసి ఉన్నప్పటి ఇంట్లోనే కోమల్‌ ఉండనున్నారు. కొడుకు(స్వయమ్‌) బాధ్యతను ఇరువురూ పంచుకుంటారు.

మరిన్ని వార్తలు