మోసం చేసిందనే మల్లీశ్వరిని చంపా: బాషా

22 Nov, 2015 17:12 IST|Sakshi
మోసం చేసిందనే మల్లీశ్వరిని చంపా: బాషా

అద్దంకి: 'భర్తను వదిలేసిన తర్వాత నాకు దగ్గరైంది. మొదట్లో అన్యోన్యంగానే ఉన్నాం. కానీ రానురానూ తాను విపరీతంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఎవరెవరితోనో మాట్లాడేది. ఎక్కడెక్కడికో వెళ్లేది. వద్దని ఎంత మొత్తుకున్నా వినేదికాదు. గట్టిగా అడిగితే నిన్నొదిలేసి హైదరాబాద్ వెళ్లిపోతానని బెదిరించేది. అంతే, పట్టలేని కోపంతో పక్కనున్న నవారు తీసుకొని తన గొంతు నులిమా' అంటూ మల్లేశ్వరిని ఎందుకు చంపాడో పోలీసులకు వివరించాడు బాషా. ప్రకాశం జిల్లా అద్దంకిలో సంచలనంరేపిన ఈ హత్యకేసు పూర్వాపరాల్లోకి వెళితే..

చీమకుర్తి మండలం పల్లమల్లి గ్రామానికి చెందిన మల్లీశ్వరి(25)కి అద్దంకి మండలం మనికేషం గ్రామానికి చెందిన రామారావుతో వివాహమైంది. చాలా ఏళ్ల కిందటే వారు విడిపోయారు. భర్తతో తెగదెంపుల అనంతరం కొత్తదామవారిపాలెంకు చేరుకున్న మల్లీశ్వరి అక్కడ ఒంటరిగా నివసిచసాగింది. ఈ క్రమంలో ముజావర్ పాలెంకు చెందిన బాషా(30) అనే వ్యక్తితో పరిచయమైంది. అదికాస్తా ప్రేమగామారి ఇరువురూ సహజీవనం చేస్తున్నారు. తనతో కలిసి ఉంటూనే మరికొందరితోనూ దగ్గరగా ఉంటోందని మల్లేశ్వరిపై అనుమానం పెంచుకున్నాడు బాషా. చాలాసార్లు హెచ్చరించి చూశాడు. శనివారం రాత్రి కూడా ఇరువురి మధ్య ఇదేవిషయంలో ఘర్షణ జరిగింది.

తనను అనుమానిస్తే హైదరాబాద్ వెళ్లిపోతానని మల్లేశ్వరి బెదిరించింది. దీంతో కోపోద్రిక్తుడైన బాషా ఇంట్లో ఉన్న నవారుతో ఆమెకు ఉరి వేసి.. ఏమి తెలియనట్లు నటించాడు. తాను రావడానికి ముందే మల్లీశ్వరి ఉరి వేసుకుందని చుట్టుపక్కలవారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి బాషాను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా మల్లీశ్వరిని తానే చంపానని బాషా అంగీకరించాడు. దీంతో బాషాపై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు.

మరిన్ని వార్తలు