నితీశ్‌పై నరేంద్రమోదీ అనూహ్య ట్వీట్‌!

26 Jul, 2017 19:45 IST|Sakshi
నితీశ్‌పై నరేంద్రమోదీ అనూహ్య ట్వీట్‌!

న్యూఢిల్లీ: బిహార్‌ ముఖ్యమంత్రిగా నితీశ్‌కుమార్ రాజీనామా చేసిన కొద్ది నిమిషాలకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి అనూహ్య ట్వీట్‌ వెలువడింది. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్‌కుమార్‌ను అభినందిస్తూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో కలిసివచ్చినందుకు ఆయనను అభినందించారు. 125 కోట్లమంది భారతీయులు నితీశ్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి అవినీతిపై పోరాడాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు.

నితీశ్‌ రాజీనామా.. ఆ వెంటనే ట్విట్టర్‌లో ప్రధాని మోదీ అభినందనలు.. అనేక సందేహాలను పటాపంచలు చేశాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. బిహార్‌లో తదుపరి ప్రభుత్వ ఏర్పాటులో నితీశ్‌కు అండగా ఉంటామని సంకేతాలు ఇస్తూ ప్రధాని మోదీ పంపిన బహిరంగ ఆహ్వానం ఇదని అభిప్రాయపడుతున్నారు. ఊహకందనిరీతిలో శరవేగంగా సాగుతున్న బిహార్‌ పరిణామాలు.. నితీశ్‌కుమార్‌ మరోసారి ఎన్డీయేలోకి ఘర్‌వాపసి చేయడం ఖాయమని చాటుతున్నాయి. మొత్తానికి బిహార్‌లో మరోసారి జేడీయూ-బీజేపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైనట్టు కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు