బంగారంపై తగ్గేది లేదు!

12 Dec, 2016 15:07 IST|Sakshi
బంగారంపై తగ్గేది లేదు!
న్యూఢిల్లీ : బంగారంపై విధించే దిగుమతి సుంకం విషయంలో తగ్గేది లేదని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. దిగుమతి సుంకాన్ని తగ్గించే యోచనలో లేనట్టు పేర్కొంది. ప్రస్తుతం బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించే ప్రతిపాదనలేమీ లేవని ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ లోక్సభకు లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. జెమ్స్, జువెల్లరీ ఎగుమతి దారులు దిగుమతి సుంకాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎగుమతులను పెంచడానికి దిగుమతి సుంకాలను తగ్గించాలని వారు పట్టుబడుతున్నారు.
 
అదేవిధంగా ఎగుమతులను పెంచడానికి రూపాయి డీవాల్యుయేషన్పై సంధించిన ప్రశ్నలకు ఆ శాఖకు సంబంధించిన మరో సహాయమంత్రి అర్జున్ రామ్ మేగ్వాల్ సమాధానమిచ్చారు. ఎక్స్చేంజ్ రేట్గా  రూపాయి అతిపెద్ద మార్కెట్లో గుర్తించబడుతుందని, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులను ఆర్బీఐ, ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుందని పేర్కొన్నారు. 2016-17 ఏప్రిల్-అక్టోబర్ కాలంలో ఎగుమతులు స్వల్పంగా 0.2 శాతం పడిపోయాయని, డాలర్కు వ్యతిరేకంగా రూపాయి విలువ 3.8 శాతం పడిపోయినట్టు చెప్పారు.  
మరిన్ని వార్తలు