మా జీతాలు, భత్యాలు రెట్టింపు చేయండి

2 Jul, 2015 20:06 IST|Sakshi
మా జీతాలు, భత్యాలు రెట్టింపు చేయండి

ఎంపీల జీత భత్యాలన్నింటినీ దాదాపు రెట్టింపు చేయాలని పార్లమెంటరీ కమిటీ ఒకటి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలాగే మాజీ ఎంపీల పింఛనును 75 శాతం పెంచాలని తెలిపింది. బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన నియమించిన ఈ కమిటీ పలు సిఫార్సులు చేసింది. ఆ సిఫార్సులు ఇలా ఉన్నాయి...

  • ఎంపీల జీతాలను ఇప్పుడున్న రూ. 50 వేల నుంచి రూ. లక్ష చేయాలి.
  • మాజీ ఎంపీలకు పింఛను ఇప్పుడు నెలకు  రూ. 20 వేలు ఉండగా, దాన్ని రూ. 35 వేలు చేయాలి.
  • పార్లమెంటు సమావేశాల సమయంలో సభకు హాజరైనందుకు ఇప్పుడు రోజుకు రూ. 2వేలు ఇస్తుండగా, దాన్ని రూ. 4వేలకు పెంచాలి.
  • మాజీ ఎంపీలతో పాటు వాళ్ల భార్యలకు కూడా రైళ్లలో ఫస్ట్ క్లాస్లో వెళ్లేందుకు అనుమతించాలి.
  • విమానాల ఎకానమీ క్లాస్లో మాజీ ఎంపీలను ఏడాదికి ఐదుసార్లు వెళ్లనివ్వాలి.
  • ఎంపీలు కేబినెట్ సెక్రటరీ కంటే ఎక్కువ ర్యాంకులో ఉంటారు కాబట్టి, వాళ్ల స్థాయికి తగ్గట్లు గౌరవ మర్యాదలు కల్పించాలి.
  • ఎంపీల పిల్లలకు పెళ్లిళ్లు అయినా, వాళ్లకు కూడా ఉచిత వైద్య సదుపాయాలు అందించాలి.


ఈ ప్రతిపాదనలలో కొన్నింటిని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు ఇప్పటికే సమర్పించారు. మరికొన్నింటిని జూలై 13న జరిగే సమావేశంలో ఖరారు చేస్తారు. చిట్టచివరిసారిగా 2010లో ఎంపీల జీత భత్యాలను సవరించారు. ఇప్పుడు ఒకసారి సవరిస్తే, మళ్లీ ఐదేళ్ల తర్వాతే సవరిస్తారు.

మరిన్ని వార్తలు