ఇంటినుంచే రిజిస్ట్రేషన్‌ సేవలు

6 Feb, 2018 13:13 IST|Sakshi
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విధానంపై అవగాహన కల్పిస్తున్న డీఐజీ లక్ష్మీనారాయణరెడ్డి

స్టాంప్స్, రిజిస్ట్రేషన్‌ శాఖ డీఐజీ లక్ష్మీనారాయణరెడ్డి

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : రాష్ట్ర ప్రజలు తమ ఇంటి వద్ద నుంచే రిజిస్ట్రేషన్‌ సేవలు పొందేలా ఆన్‌లైన్‌ విధానాన్ని గత నెల 1వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని, ఈ విధానం ద్వారా కక్షిదారులు తమ ఇంటి వద్ద నుంచే రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఏలూరు రేంజ్‌ డీఐజీ కె.లక్ష్మీనారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విధానంపై నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా డీఐజీ మాట్లాడుతూ 1883లో రిజి స్ట్రేషన్‌ శాఖ ఆవిర్భవించిందని, అప్పటి నుంచి వివిధ దశల్లో అభివృద్ధి చెందుతూ ప్రజలకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ వస్తోందన్నారు.

1999లో ప్రారంభించిన కంప్యూటరీకరణతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభతరమైందని, ప్రస్తు త ఆన్‌లైన్‌ విధానం మరింత సౌలభ్యంగా ఉంటుందని చె ప్పారు. ఆన్‌లైన్‌ విధానం ద్వారా మీ సేవా కేంద్రాలకు, రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లకుండా ఉచితంగా ఈసీలు, దస్తావేజు సర్టిఫైడ్‌ కాపీలు పొందవచ్చన్నారు. దస్తావేజుల కీలక సమాచారం పౌరులచే నమోదు చేయడానికి, సొంతంగా దస్తావేజులను తయారు చేసుకోవడానికి ఈ విధానం దోహదపడుతుందన్నారు. ఈ విధానం ముఖ్యంగా బ్యాం కర్లు, న్యాయవాదులు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులకు మేలుచేస్తుందన్నారు. గతనెలలో ఏలూరు రిజిస్ట్రేషన్‌ జిల్లాలో 380, భీమవరం రిజిస్ట్రేషన్‌ జిల్లాలో 280 లావాదేవీలు జరిగాయని స్పష్టంచేశారు. ఏలూరు జిల్లా రిజిస్ట్రార్‌ పి.విజయలక్ష్మి, సబ్‌ రిజిస్ట్రార్లు, కక్షిదారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు