రాజవొమ్మంగి: దశాబ్దాల కాలంగా యూటీఎఫ్ చేస్తున్న పోరాటాల వల్ల సమస్యలు పరిష్కరించుకోగలిగామని ఎమ్మెల్సీ (పీడీఎఫ్) ఐ. వెంకటేశ్వర్రావు అన్నారు. శనివారం స్థానిక శ్రీఅల్లూరి సీతారామరాజు జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పింఛను సమస్య పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు మాట్లాడుతూ గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం, భరతనాట్యం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గ్రామంలో డప్పువాయిద్యాల మధ్య భారీ ర్యాలీ నిర్వహించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దివంగత కోడూరి నారాయణరావు, దాచూరి రామిరెడ్డి, వత్సవాయ సూర్యనారాయణరాజు, చెన్ను పాటి లక్ష్మయ్య, మైనేని వెంకటరత్నం, అప్పారి వెంకటస్వామి, నాగాటి నారాయణ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో రాష్ట్ర గౌరవాధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్. ప్రసాద్, స్థానిక ఎంఈఓలు తాతబ్బాయిదొర, సూరారెడ్డి, హెచ్ఎం గోపాలకృష్ణ, సభ్యులు పైడిమల్లు, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.