పాడేరు రూరల్ : అరకులో ఈనెల 15న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటనను విజయవంతం చేయాలని ఐటీడీఏ పీవో వి. అభిషేక్ సూచించారు. శనివారం సాయంత్రం సంబంధిత శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. బిర్సాముండా జయంతి ఉత్సవాల్లో భాగంగా జన జాతీయ గౌరవ దినోత్సవ్, వీక్షిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాలను స్థానికంగా గవర్నర్, జార్ఖండ్ నుంచి ప్రధాన మంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారన్నారు. అరకువేలి మండలం పెదలబుడు వద్ద హెలీప్యాడ్, క్రీడా పాఠశాల మైదానంలో సభా వేదిక ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీడీవీకే, జీసీసీ, సికిల్సెల్ ఎనీమియా ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటుచేయాలని సూచించారు. వీక్షిత్ భారత్ సంకల్పయాత్ర వాహనాలను గవర్నర్ జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు. లబ్ధిదారులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలతో పాటు, ఉజ్వల పథకంలో గ్యాస్ కనెక్షన్లను ఆయన అందజేస్తారని తెలిపారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రధానమంత్రి వర్చువల్ కార్యక్రమానికి సాంకేతికంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్నివాల్ ప్రదర్శనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్సులో ఆర్ఆండ్బీ, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులు, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అధికారులు, అరకు తహసీల్దార్, మ్యూజియం క్యూరేటర్, డీపీఆర్వో పాల్గొన్నారు.