కేసుల సత్వర పరిష్కారానికి రాష్ట్ర వ్యాజ్య విధానం

1 Aug, 2021 05:08 IST|Sakshi

ఏపీ ఆన్‌లైన్‌ లీగల్‌ కేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ఏర్పాటు

వ్యాజ్యాలపై సీఎస్‌ అధ్యక్షతన న్యాయ, ప్రభుత్వ శాఖల అధికారుల సమావేశం

సాక్షి, అమరావతి: నూతనంగా తీసుకురానున్న రాష్ట్ర వ్యాజ్య విధానాన్ని (స్టేట్‌ లిటిగేషన్‌ పాలసీ) సమర్థవంతంగా అమలు చేస్తే కేసులు సత్వర పరిష్కారానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో వ్యాజ్యాల అంశంపై న్యాయాధికారులు, కార్యదర్శులతో సమావేశం జరిగింది.  సీఎస్‌ మాట్లాడుతూ స్టేట్‌ లిటిగేషన్‌ పాలసీని నిరంతరం పర్యవేక్షిస్తూ పటిష్టంగా అమలు చేస్తే కేసుల్లో జాప్యాన్ని నివారించవచ్చన్నారు. ఈ విధానం వల్ల కేసుల వివరాలు ప్రభుత్వ న్యాయవాదులకు, ప్రభుత్వ శాఖల అధికారులకు ఎప్పటికప్పుడు తెలుస్తాయని, తద్వారా సకాలంలో  కౌంటర్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉం టుందని చెప్పారు. తద్వారా కోర్టులపై ప్రభుత్వ వ్యాజ్యాల భారాన్ని కూడా తగ్గించవచ్చన్నా రు. అదేవిధంగా రాష్ట్ర విచారణ సేవల (స్టేట్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌)ను మరింత బలోపేతం చేసేందుకు వ్యాజ్య విధానం దోహదం చేస్తుం దని చెప్పారు. అందుకే ఏపీ ఆన్‌లైన్‌ లీగల్‌ కేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ప్రవేశ పెట్టనున్నట్టు తెలి పారు. దీనివల్ల జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టులకు సంబంధించిన వివిధ వ్యాజ్యాల సమగ్ర డేటాబేస్‌ అందుబాటులో ఉంటుందన్నారు. 

సమన్వయంతోనే సత్వర పరిష్కారం
సమావేశంలో రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ న్యాయవాదులు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే కేసుల సత్వర పరిష్కారానికి అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాజ్య విధానం, ప్రభుత్వ శాఖల విధానాలు, నిబంధనల ఫ్రేమ్‌వర్క్, వ్యాజ్యాల దాఖలు స్థాయిలోనే సవాల్‌ చేసేలా తీసుకోవాల్సిన చర్యలు, వ్యాజ్యాలపై నిర్ణీత కాల వ్యవధిలో సమీక్ష, వైఫల్యాలపై జవాబుదారీతనం తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఆన్‌లైన్‌ కేస్‌ లోడ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌  అమలు సమీక్షించారు. ప్రతి ప్రభుత్వ శాఖలో లైజన్‌ అధికారులు, లీగల్‌ ఆడ్వైజర్లను నియమించుకునే అంశంపై చర్చించారు. రాష్ట్ర ఆదనపు అడ్వకేట్‌ జనరల్‌ పి.సుధాకర్‌రెడ్డి, న్యాయ శాఖ కార్యదర్శి వి.సునీత, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, న్యాయాధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు