అలా వచ్చారు.. ఇలా వెళ్లారు

28 Mar, 2022 10:07 IST|Sakshi
ఎమ్మెల్యే బాలకృష్ణతో మాట్లాడుతున్న అఖిలపక్షం కన్వీనర్‌ బాలాజీ మనోహార్‌

పెళ్లికి హాజరై వెంటనే వెళ్లిపోయిన ఎమ్మెల్యే బాలకృష్ణ

టీడీపీలో మళ్లీ బయట పడ్డ విభేదాలు

హిందూపురం: ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదివారం హైదరాబాద్‌ నుంచి హిందూపురం వచ్చారు. పట్టణంలోని ఓ ఫంక్షన్‌లో నిర్వహించిన టీడీపీ నాయకుడి కుమార్తె పెళ్లికి హాజరయ్యారు. భోజనం చేసిన తర్వాత సరాసరి హైదరాబాద్‌కు బయలు దేరి వెళ్లిపోయారు. ఏదైనా మాట్లాడతారేమోనని మీడియా సభ్యులంతా ఎదురు చూసినా ఎమ్మెల్యే బాలకృష్ణ మాత్రం ముఖం చాటేశారు.  

బయటపడ్డ విబేధాలు 
పెళ్లి కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటనలో టీడీపీలో ఉన్న వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఫంక్షన్‌ హాల్‌లోని ఓ గదిలో బాలయ్య భోజనం చేస్తున్నారు. ఇదే సమయంలో అక్కడున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొర్లకుంట అంజినప్పతో పాటు పట్టణ అధ్యక్షుడు డీఈ రమేష్‌లను బయటకు వెళ్లిపోవాలని బాలకృష్ణ పర్సన్‌ పీఏ, కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు ఆదేశించారు. దీంతో వారు ఆయనపై రుసరుసలాడుతూ బయటకు వచ్చేశారు.

అయితే ఫంక్షన్‌ హాల్‌ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణ బయటకు వచ్చి కారు ఎక్కారు. అదే సయమంలో శ్రీనివాసరావుపై టీడీపీ నాయకుడు కొల్లకుంట అంజి çనిప్పులు చెరిగారు. ‘నీవు వచ్చినప్పుటి నుంచే పార్టీ నాశనం అవుతోంది... బయట వారి పెత్తనం ఇక్కడేంటి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శ్రీనివాసరావు, అంజిల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ ఉన్న నాయకులు నాగరాజు, మరికొందరు శ్రీనివాసరావుకు సర్దిచెప్పి పక్కకు తీసుకెళ్లిపోయారు.  

తేదీ ఖరారు చేయండి.. రాజీమానా చేస్తా 
హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలంటూ హైకోర్టులో వాజ్యం వేసినట్లు అఖిలపక్ష కన్వీనర్‌ బాలాజీ మనోహార్‌ ఎమ్మెల్యే బాలకృష్ణకు తెలిపారు. జిల్లా కేంద్రం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు కదా ఆ విషయంపై స్పందించాలని కోరారు. అఖిలపక్షం నేతలు తేదీ ఖరారు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పినట్లు బాలాజీ మనోహర్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు