మహానది– గోదావరి అనుసంధానానికి చిక్కులు

12 Mar, 2023 04:18 IST|Sakshi

మహానది జలాలపై ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల మధ్య వివాదం

దాని పరిష్కారానికి 2018లో ట్రిబ్యునల్‌ ఏర్పాటు

ఇప్పటికీ కేంద్రానికి తుది నివేదిక ఇవ్వని ట్రిబ్యునల్‌

ఈ నేపథ్యంలో అనుసంధానం చేపడితే న్యాయపరమైన ఇబ్బందులు

న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని టాస్క్‌ఫోర్స్‌ నిర్ణయం

సాక్షి, అమరావతి: మహానది–గోదావరి అ­నుసంధానానికి ప్రతిపాదన దశలోనే న్యా­య­పరమైన చిక్కులు ఉత్పన్నమ­య్యా­యి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల మధ్య మహానది జలాల వినియోగంలో వివాదాన్ని పరిష్కరించడానికి కేంద్రం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్‌ ఇప్పటిదాకా తుది నివేదిక ఇవ్వలేదు.

మహానది జలాల వినియోగం వివాదంపై ట్రిబ్యునల్‌ విచారణ కొనసాగు­తున్న నేపథ్యంలో న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్నాకే మహా­నది–­గోదావరి అనుసంధానంపై ముందుకెళ్లాల­ని సోమవారం నిర్వహించిన 17వ సమావే­శంలో టాస్క్‌ఫోర్స్‌  నిర్ణయం తీసుకుంది.

ఇదీ ప్రతిపాదన
ఒడిశాలో బర్మూర్‌ నుంచి 408 టీఎంసీల మహానది జలాలను గోదావరికి మళ్లించేలా జాతీయ జల వన­రుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదించింది. ఇందులో 178 టీఎంసీలను ఒడిశా చేపట్టిన ఐదు ప్రాజెక్టులకు కేటాయించింది. మిగతా 230 టీఎంసీలను ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన గోదావరిలోకి తరలించి, వాటిని గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు సరఫరా చేయాలని పేర్కొంది.

తెగని మహానది జలాల వివాదం
ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల మధ్య మహానది జలాలపై తలెత్తిన వివాదం పరిష్కారానికి 2018లో కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసిం­ది. విచారణ జరిపి, ని­వేదిక ఇవ్వడానికి మూ­డేళ్ల గడువిచ్చింది. గడు­వులోగా విచారణ పూర్తి చేయలేదు. దాంతో 2021 మార్చి 11న గడువును మరో రెండేళ్లు పెంచింది. ఈ గడువు కూడా శుక్ర­వారంతో ముగిసింది. ఇప్పటికీ ట్రి­బ్యు­నల్‌ కేంద్రానికి తుది నివేదిక ఇవ్వలేదు.

మహానది టు కావేరి వయా గోదావరి
జూన్‌ నుంచి అక్టోబర్‌ మధ్య 143 రోజుల్లో ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా(నాగార్జునసాగర్‌), పెన్నా (సోమశిల), కావేరి (గ్రాండ్‌ ఆనకట్ట)కు తరలించడం ద్వారా గోదావరి–కావేరిలను అనుసంధానించేలా ఎన్‌డబ్ల్యూడీఏ 2021 ఏప్రిల్‌లో డీపీఆర్‌ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) తయారు చేసింది.

గోదావరి నికర జలాల్లో మిగులే లేదని, శాస్త్రీయంగా అధ్యయనం చేసి, మిగులు తేల్చాకే గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాల­ని ఏపీ, తెలంగాణ ఆదిలోనే స్పష్టం చేశాయి. దాంతో ఛత్తీస్‌గఢ్‌ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానంలో తరలించేలా డీపీఆర్‌ను ఎన్‌డబ్ల్యూడీఏ మార్పులు చేసింది. ఇటీవల జరిగిన టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో దీనిపై చర్చించారు.

ఛత్తీస్‌గఢ్‌ కోటాలో వాడుకోని గోదావరి జలాలకు.. 230 టీఎంసీల మహానది జలాలను జత చేయడం ద్వారా మహానది – గోదావరి – కావేరిలను అనుసంధానిస్తే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలలో దుర్భిక్ష ప్రాంతాల్లో సాగు, తాగు నీటి ఇబ్బందులను అధిగమించవచ్చునని ఎన్‌డబ్ల్యూ­డీఏ ప్రతిపాదిస్తోంది. 

మరిన్ని వార్తలు