టెండర్ నోటిఫికేషన్ జారీచేసిన జలవనరుల శాఖ
పనుల పూర్తికి రెండేళ్లు గడువు
జనవరి 10లోగా షెడ్యూలు దాఖలుకు అవకాశం
17న ఆర్థిక బిడ్.. అదే రోజున రివర్స్ టెండరింగ్
తక్కువ ధరకు కోట్చేసిన సంస్థకు పనుల అప్పగింత
సాక్షి, అమరావతి: గతేడాది నవంబర్ 19న చెయ్యేరుకు వచ్చిన ఆకస్మిక భారీ వరదలకు దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును పునరుద్ధరించే పనులకు రూ.635.21 కోట్ల అంచనాతో జలవనరులశాఖ టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. లంప్సమ్–ఓపెన్ విధానంలో రెండేళ్లలోగా ప్రాజెక్టును పూర్తిచేయాలని షరతు విధించింది. జనవరి 10వ తేదీలోగా టెండర్లో పాల్గొనేందుకు షెడ్యూలు దాఖలు చేయడానికి అవకాశం కల్పించింది.
ఆర్థిక బిడ్ను జనవరి 17న ఉదయం 11 గంటలకు తెరిచి, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తారు. తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు టెండర్ అప్పగించాలని స్టేట్ లెవల్ టెక్నికల్ కమిటీ (ఎస్.ఎల్.టి.సి.)కి ప్రతిపాదనలు పంపుతారు. కాంట్రాక్టు సంస్థ అర్హతలను మరోసారి పరిశీలించి, నిబంధనల ప్రకారం టెండర్ను ఎస్.ఎల్.టి.సి. ఆమోదిస్తుంది. తర్వాత కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగిస్తూ జలవనరుల శాఖ ఒప్పందం చేసుకుంటుంది.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో
అన్నమయ్య జిల్లాలో రాజంపేట మండలంలోని బాదనగడ్డ వద్ద చెయ్యేరుపై దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును 2.24 టీఎంసీల సామర్థ్యంతో పునరుద్ధరించేలా పనులను కాంట్రాక్టు సంస్థ చేపడుతుంది. చెయ్యేరుకు భారీ వరద వచ్చినా చెక్కుచెదరకుండా నిలబడేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణ పనులను ప్రభుత్వం చేపట్టింది.