జగనన్నే మళ్లీ సీఎం కావాలి

2 Nov, 2023 04:16 IST|Sakshi

పట్నంబజారు (గుంటూరుఈస్ట్‌): విద్యా సాధికారత జగనన్నతోనే సాధ్యమని గుంటూరు వేదికగా విద్యార్థి లోకం గొంతెత్తి నినదించింది. పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బుధవారం ‘‘వై ఏపీ నీడ్స్‌ వైఎస్‌ జగన్‌’’ కార్యక్రమంలో భాగంగా గుంటూరు లాడ్జి సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం, శంకర్‌విలాస్, ఓవర్‌బ్రిడ్జి, ఏసీ కళాశాల మీదుగా హిందూ కాలేజ్‌ సెంటర్‌లోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

‘‘మా బతుకులు మారాలంటే.. మా తలరాతలు మే­మే రాసుకోవాలంటే.. ఉన్నత విద్య, అత్యున్నత ఉద్యో­గ అవకాశాలతో మా జీవన స్థితిగతులలో సమూలమైన మార్పు రావాలంటే.. మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలి’’ అంటూ విద్యార్థులు నినాదాలతో హోరెత్తించా­రు. ఈ సందర్భంగా పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్య­క్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ.. విద్యారంగం అభివృద్ధికి జగనన్న ఏమేం చేశారో చెప్పడానికే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. అనేక పథకాలతో రాష్ట్రంలో అక్షరకాంతులు పూయిస్తున్నారన్నారు.

రాష్ట్రానికి మళ్లీ మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర అవతరణ దినోత్సవాన గుంటూరు వేదికగా విద్యార్థి లోకం గర్వంగా గొంతెత్తి చాటిచెప్పడం శుభపరిణామమని అన్నారు. ర్యాలీలో విద్యార్థి విభాగం రీజనల్‌ కోఆర్డినేటర్లు విఠల్, మనోహర్, గుంటూరు జిల్లా అధ్య­క్షుడు వినోద్, పల్నాడు జిల్లా అధ్యక్షుడు సిరాజ్, నాయకులు గంటి, రవి, బాజీ, జగదీష్, వలి, బంటి, మహేష్, అజయ్, కరీమ్, కిరణ్, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు