జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం

27 Jul, 2021 16:36 IST|Sakshi

విశాఖపట్టణం: గ్రేటర్ విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్‌‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. మంగళవారం ఉదయం ప్రారంభమైన ఓటింగ్‌ మధ్యాహ్నం ముగిసింది. అనంతరం సాయంత్రం వరకు కౌంటింగ్ కొనసాగింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌‌సీపీ కార్పొరేటర్లు 10 మంది విజయం సాధించారు. స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలో 67 మంది కార్పొరేటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 57 మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్లు మంది ఉండగా, స్వతంత్రులు 4, ముగ్గురు టీడీపీ, బీజేపీ 1, జనసేన 1, సీపీఐ 1 కార్పొరేటర్లు ఉన్నారు.

ఈ ఎన్నికల్లో విజయంపై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వైఎస్సార్‌ కాంగ్రెస​ పార్టీ సీనియర్‌ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నా టీడీపీ ఉనికి కాపాడుకోవడానికి పోటీ చేసిందని విమర్శించారు. ప్రజలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారని ఈ ఫలితాలతో రుజువైందన్నారు. పరిపాలన రాజధానికి గ్రేటర్ విశాఖ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. తమకు ఏ పార్టీలు పోటీనే కాదు అని స్పష్టం చేశారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసిన విశాఖ అభివృద్ధిని అడ్డుకోలేరని తెలిపారు. విశాఖలో ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని పార్టీ నేతలు విమర్శించారు. గ్రేటర్ విశాఖలో గెలిచి మరోసారి సత్తా చాటామని.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ తాము ఘన విజయం సాధిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు