Lijjat Papad: రూ.80 పెట్టుబడి కట్‌ చేస్తే రూ.1600 కోట్ల టర్నోవర్‌

19 Aug, 2021 12:47 IST|Sakshi

సాక్షి వెబ్‌ డెస్క్‌: మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన ఏడుగురు మ‌హిళ‌లు. బిజినెస్ బ్యాక్ గ్రౌండ్ లేదు.పెద్దగా చదువు కోలేదు. కానీ రూ.80 పెట్టుబడి పెట్టి 1600 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఇప్పుడు 69 ప్రాంతాల్లో 42వేల మంది ఉద్యోగుల‌తో నిర్వ‌హిస్తున్నారు. ఆ మ‌హిళ‌లు ఎవ‌రో కాదు శ్రీ మ‌హిళా గృహ ఉద్యోగ్ లిజ్జ‌త్ పాప‌డ్ వ్య‌వ‌స్థాప‌కులు. ఇంటి వద్ద నుంచే ప్రారంభ‌మైన లిజ్జ‌త్ పాప‌డ్ బిజినెస్ కార్పొరేట్‌ స్థాయిలో వ్యాపార కార్య‌కలాపాల్ని నిర్వ‌హిస్తుంది. ఇంత‌కీ ఆ పాప‌డ్ కంపెనీ స్పెష‌ల్ ఏంటీ? ఆ ఏడుగురు మ‌హిళ‌లు కేవ‌లం రూ.80 ప్రారంభ పెట్టుబ‌డితో 62 ఏళ్లుగా వంద‌ల కోట్ల బిజినెస్‌ను ఎలా ర‌న్ చేస్తున్నారు.  

ఆత్మవిశ్వాసమే ఆలంబనగా

1959లో ముంబై  గూర్ గావ్ ప్రాంతానికి చెందిన లోహ‌న నివాస్ అనే బిల్డింగ్లో నివాసం ఉంటున్న గుజ‌రాతి కుటుంబాల‌కు చెందిన  జశ్వంతిబెన్ జమ్నాదాస్ పోపాట్, పార్వతీబెన్ రామదాస్ తోడాని, ఉజాంబెన్ నారందాస్ కుండాలియా, బానుబెన్. ఎన్. తన్నా, లగుబెన్ అమృతలాల్ గోకాని, జయబెన్ వి. విఠలానీ, దివాలిబెన్ లుక్కా అనే ఏడుగురు మ‌హిళ‌లు క‌లిసి ఏదైనా బిజినెస్ పెట్టాల‌ని అనుకున్నారు. చ‌దువు లేదు. ఇంట్లోనుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌లేరు. కేవలం ఏదో సాధించాలనే పట్టుదల, కష్టాలను వెరవని ఆత్మవిశ్వాసమే వారిని ముందుకు నడిపింది. కేవ‌లం రూ.80పెట్టుబ‌డితో తమకు తెలిసిన పాపడ్‌ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించారు. దానికి  లిజ్జత్ పాప‌డ్ అని పేరు పెట్టారు. లిజ్జత్ అంటే  అంద‌రూ ఎద‌గాలని అర్ధం . 

ఇంటింటికి లిజ్జత్‌

మంచి క్వాలిటీ, టేస్ట్ తో పాప‌డ్ ను త‌యారు చేయ‌డంతో ఇత‌ర దుకాణాలకు చెందిన  వ్యాపారులు లిజ్జత్ పాప‌డ్‌ల‌ను కొనుగోలు చేయ‌డం ప్రారంభించారు. అందుకు తగ్గట్టుగా వ్యాపారాన్ని విస్తరించేంత పెట్టుబడి వారి దగ్గర లేదు. అప్పుడే వారికో ఐడియా తట్టింది. ఇంటి దగ్గర ఉండే మహిళలన్ని తమ వ్యాపారంలో భాగస్వాములను చేశారు. పాపడాలు తయారు చేసే పనిని వారికి అప్పగించారు. తక్కువ పని, తక్కువ జీతం ఎక్కువ ఉత్పత్తి సాధ్యమైంది. మార్కెట్‌ డిమాండ్‌ని అందుకోగలిగారు. అలా ముంబైలో లిజ్జత్‌ ఇంటింటా ఓ తప్పనిసరి వస్తువుగా మారిపోయింది. అయితే ఈ పని అంత ఈజీగా జరగలేదు. దీని కోసం ఆ మహిళలు కొత్త వ్యూహాన్ని రచించారు. 

బిజినెస్‌ మోడల్‌

ఇప్పుడంటే ఆడవాళ్లు కూడా ఆఫీసులకు వెళ్లి పని చేయగలుగుతున్నారు కానీ 1950,1960ల అంత సులువు కాదు. అందుకే పాపాడ్‌ తయారీకి అనువైన పిండి, ఇతర మసాల దినుసులను లిజ్జత్‌ ప్రధాన కార్యాలయంలో ఉంచేవారు. పాపడ్‌ తయారు చేసే మహిళలు వాటిని తమ ఇళ్లకు తీసుకెళ్లి ఇంటి దగ్గరే వాటిని తయారు చేసేవారు. మరుసటి రోజు వాటిని హెడ్‌ ఆఫీస్‌లో ఇచ్చే వారు. మళ్లీ పిండి తీసుకువెళ్లేవారు. చేసిన అప్పడాలకు సంబంధించిన డబ్బులు ఎప్పటికప్పుడు ఇచ్చేవారు. ఇంటి దగ్గరే ఉంటూనే డబ్బులు సంపాదించే వాలు ఉండటంతో అనతి కాలంలోలోనే  లిజ్జత్‌ పాపాడాలు తయారు చేసేందుకు ఆసక్తి చూపించే మహిళల సంఖ్య పెరిగిపోయింది.

ప్రతీక్షణం అప్రమత్తం

గృహిణులు ప్రతీ రోజు ఆఫీసుకు ఇంటికి వచ్చి పోయేప్పుడు ఇబ్బందులు రాకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అంతేకాదు ఇంటి దగ్గర పరిశుభ్రమైన వాతావరణంలో నాణత్య పాటిస్తున్నారా లేదా అని తెలుసుకునేందుకు రెగ్యులర్‌గా హోం చెకప్‌లు కూడా చేసేవారు. లిజ్జత్‌ పాపడ్‌లో పని చేయాలనుకునే వారికి మొదట పాపడ్‌ రోలింగ్‌ వర్క్‌ అప్పచెప్పేవారు. అక్కడ బాగా పని చేస్తేనే తర్వాత పిండి కలపడం వంటి ఇతర బాధ్యతలు ఓ క్రమ పద్దతిలో అప్పగించేవారు. ఇలా గృహిణులు తమకు తెలిసిన పద్దతిలో తమకు ఎదురైయ్యే సవాళ్లను ముందుగానే ఊహిస్తూ బిజినెస్‌ను ముందుకు తీసుకెళ్లారు. 

కుటుంబ భావన

లిజ్జత్‌ ఎదిగే క్రమంలో అండగా నిలిచిన వర్కర్లందరికీ ఆసరాగా ఉండాలని నిర్ణయించుకున్నారు. లిజ్జత్‌ పాపడ్‌ స్థాపించిన ఐదేళ్ల తర్వాత దానిని శ్రీ మహిళా గృహ ఉద్యోగ్‌ లిజ్జత్‌ లిమిటెడ్‌ సంస్థగా మార్చారు.  అందులో పని చేసే  కింది స్థాయి ఉద్యోగి నుంచి పై స్థాయి వరకు అందరికీ కంపెనీలో భాగస్వామ్యం ఇచ్చారు.  ఇది మనది అనే భావన కలిగించారు. కంపెనీలో లాభాలు వ‌చ్చినా, న‌ష్టాలు వ‌చ్చినా మ‌హిళ‌లంద‌రూ స‌మానంగా పంచుకునేలా తీర్మాణం చేశారు. 

42 వేల మందికి ఉపాధి

అత్తెసరు అక్షర జ్ఞానం కలిగిన ఏడుగురు మహిళలు ఏర్పాటు చేసిన లిజ్జత్‌ ఈరోజు మహా వృక్షంగా మారింది. దేశంలో 67 బ్రాంచీల్లో 42 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మనదేశంలో పాటు 15 దేశాలకు ఈ పాపడ్‌లు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం లిజ్జత్‌ కంపెనీ ఏడాది టర్నోవర్‌ ఏకంగా రూ. 1600 కోట్ల రూపాయల పైమాటే అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఎలాంటి మేనేజ్‌మెంట్‌ డిగ్రీలు లేకుండా కేవలం పరిస్థితులను అంచనా వేస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటూ లిజ్జత్‌ని ఈ స్థాయికి తీసుకొచ్చారు.

అచ్చం కుటుంబం లానే

సాధారణంగా కంపెనీలు జీతం తప్ప కార్మికుల సంక్షేమం పట్ల అంతగా పట్టించుకోవు అనుకుంటాం. కానీ లిజ్జత్‌ పూర్తిగా మహిళల ఆధ్వర్యంలో నడిచే సంస్థ అందుకే జీతాలు, భాగస్వామ్యం వంటి మనీ మ్యాటర్స్‌ ఒక్కటే కాదు వెల్ఫేర్‌లోనూ ముందు ఉంది. ఈ కంపెనీలో  ప‌నిచేసే ఉద్యోగుల పిల్ల‌ల‌కు ఉన్నత‌ విద్య, వైద్యాన్ని అందిస్తున్నారు.  సహాకసంఘాల శక్తి ఎలాంటిదో ప్రపంచానికి చాటి చెప్పారు. 

చదవండి : నీ లుక్‌ అదిరే, సరికొత్త ఫీచర్లతో విడుదలైన సెడాన్‌

మరిన్ని వార్తలు