మెహుల్‌ చోక్సీపై తాజా కేసు

16 Jul, 2022 01:41 IST|Sakshi

కెనరా బ్యాంక్‌ కన్సార్టియంకు రూ.55.27 కోట్ల టోకరా

న్యూఢిల్లీ: కెనరా బ్యాంక్‌ నేతృత్వంలోని కన్సార్టియంను రూ. 55.27 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలపై పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీపై సీబీఐ తాజా ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు. చోక్సీ, చేత్నా ఝవేరి, దినేష్‌ భాటియా, మిలింద్‌ లిమాయేసహా గతంలో గీతాంజలి జెమ్స్‌లో భాగమైన డిడామస్‌ జ్యువెలరీగా పిలవబడే బెజెల్‌ జ్యువెలరీ, దాని పూర్తికాల డైరెక్టర్లపై 2021 ఆగస్టు 30న బ్యాంక్‌ ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదు అనంతరం దాదాపు ఏడాది తర్వాత ఏజెన్సీ చర్య తీసుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 22న అనుమతించడంతో సీబీఐ ఈ కేసు విచారణను ప్రారంభించింది.  ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తర్వాత ముంబైలోని ఝవేరీ, భాటియా, లిమాయే నివాసాల్లో సీబీఐ సోదాలు నిర్వహించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) జనవరి 2018లో చోక్సీ, అతని మేనల్లుడు నీరవ్‌ మోడీ చేసిన రూ. 13,000 కోట్ల భారీ మోసాన్ని వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు